- కిలో ఎండు గంజాయి, బైక్ స్వాధీనం
ఘట్ కేసర్, వెలుగు : గంజాయి అమ్ముతున్న ఇద్దరిని హైదరాబాద్ లోని ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధి బొల్లిగూడలో ఉంటున్న సాయికుమార్ (19), నాగారం మున్సిపాలిటీ ఎస్వీ నగర్ కు చెందిన శివాజీ (23) కొంతకాలంగా ఏపీలోని అరకు నుంచి గంజాయిని సిటీకి తెచ్చి బోడుప్పల్, చర్లపల్లి, కుషాయిగూడ ఏరియాల్లోని యువకులకు, స్టూడెంట్లకు అమ్ముతున్నారు.
దీని గురించి సమాచారం అందుకున్న ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు గురువారం బొల్లిగూడలోని సాయికుమార్ ఇంట్లో తనిఖీలు చేశారు. 2 కిలోల ఎండు గంజాయిని గుర్తించారు. ఇంటి బయట పార్కింగ్ లో ఉన్న యాక్టివా బైక్ లో కిలో ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సాయికుమార్తో పాటు శివాజీని అదుపులోకి తీసుకున్నారు. రూ. 5 లక్షల విలువైన 3 కిలోల ఎండు గంజాయి, బైక్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించామన్నారు.