- టెండర్ లేకుండానే కోటి స్ట్రిప్స్కు ఆర్డర్
- ఏపీలో రూ.13.94కు ఒక స్ట్రిప్ అమ్మిన కంపెనీ
- అదే కంపెనీ నుంచి రూ.16.59 పెట్టి కొన్న టీఎస్ఎంఎస్ఐడీసీ
- రూల్స్ పాటించలేదని విజిలెన్స్కు ఫిర్యాదులు
హైదరాబాద్, వెలుగు: పిల్లలు, గర్భిణులలో హీమోగ్లోబిన్ లెవల్స్ పరీక్షించేందుకు అవసరమైన టెస్టింగ్ స్ట్రిప్స్ కొనుగోలులో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ పిలవకుండానే ఓ కంపెనీ నుంచి ఎక్కువ ధరకు స్ట్రిప్స్ కొనుగోలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో సుమారు రూ.2 కోట్ల వరకూ అవినీతి జరిగినట్టుగా విజిలెన్స్ డిపార్ట్మెంట్కు, ఢిల్లీలోని నేషనల్ హెల్త్ మిషన్ ఆఫీసర్లకూ ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది. ఇదే అంశంపై బయోసెన్స్ అనే మరో కంపెనీ కోర్టుకు ఎక్కింది. రూల్స్ కు విరుద్ధంగా కొనుగోలు జరిగిందని, ఈ కొనుగోలు ఆర్డర్ను నిలిపివేయాలని ఆ కంపెనీ కోర్టును కోరినట్టు సమాచారం.
ఇదీ జరిగింది..
‘ఎనీమియా ముక్త్ భారత్’ స్కీమ్లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో పిల్లలు, గర్భిణులకు హీమోగ్లోబిన్ పరీక్షలు చేయించేందుకు నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్రం నిధులు కేటాయిస్తోంది. ఈ స్కీమ్లో భాగంగా మన రాష్ట్రానికి నిధులు వచ్చాయి. మన స్టేట్లో పిల్లలకు టెస్ట్ చేసేందుకు 79.2 లక్షల స్ట్రిప్స్, గర్భిణులకు టెస్ట్ చేసేందుకు 21.6 లక్షల స్ట్రిప్స్ అవసరం అవుతాయని స్టేట్ ఎన్హెచ్ఎం ఆఫీసర్లు అంచనా వేశారు. రాష్ట్రంలో దవాఖాన్లు, హెల్త్ క్యాంపుల్లో వాడే మెడికల్ ఎక్విప్మెంట్, డ్రగ్స్ను టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా కొనుగోలు చేస్తారు. దీంతో స్ట్రిప్స్ కొనుగోలు చేయాలని ఎన్హెచ్ఎం నుంచి టీఎస్ఎంఎస్ఐడీసీకి రిక్వెస్ట్ పెట్టారు. హీమోగ్లోబిన్ స్ట్రిప్స్ సప్లై చేయడానికి గతంలో ఆస్పెన్ అనే కంపెనీతో టీఎస్ఎంఎస్ఐడీసీ ఒప్పందం(రేట్ కాంట్రాక్ట్) చేసుకుంది. టెండర్ లేకుండా, నేరుగా ఈ కంపెనీకి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో స్ట్రిప్కు రూ.16.59 చొప్పున కోటి 80 వేల స్ట్రిప్స్ కొనాలని నిర్ణయించారు. నవంబర్లో ఇదే కంపెనీ ఏపీ ప్రభుత్వానికి ఒక్కో స్ట్రిప్కు రూ.13.94 చొప్పున అమ్మింది. వారం రోజుల తేడాలోనే ఈ రెండు ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఏపీ కంటే, మన అధికారులు రూ.2.65 ఎక్కువ పెట్టి కొన్నారు. దీంతో సుమారు రూ.2 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు గండి పడినట్టు విజిలెన్స్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదులు వెళ్లాయి. ఏపీ ప్రభుత్వం స్ట్రిప్స్ మాత్రమే కొనిందని, తాము స్ట్రిప్స్తో పాటు కంట్రోల్స్, స్టెరైల్ స్వాబ్స్ కూడా కొనుగోలు చేయడం వల్లే ధరలో తేడా ఉందని టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు చెబుతున్నారు. అవన్నీ కలిపినా టీఎస్ఎంఎస్ఐడీసీ పెట్టింది ఎక్కువ ధర అని ఇతర కంపెనీలు ఆరోపిస్తున్నాయి. బయోసెన్స్ అనే మరో కంపెనీ దీనిపై కోర్టులో కేసు కూడా వేసింది.
కంపెనీలతో బేరాలు
టీఎస్ఎంఎస్ఐడీసీ డ్రగ్స్ వింగ్లో ఇలాంటి అవకతవకలు భారీగానే జరుగుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఓ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఈ కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు హెల్త్ డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతోంది. టీఎస్ఎంఎస్ఐడీసీ టెండర్లలో పాల్గొనే కంపెనీల నుంచి వసూళ్లు చేస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. డ్రగ్స్ వింగ్ ఇన్చార్జ్గా ఉస్మానియాకు చెందిన ఓ ప్రొఫెసర్ ఉన్నారు. ఆమె ఉస్మానియాకే పరిమితం అవుతుండటంతో, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ చెప్పిందే నడుస్తోంది. ఉన్నతాధికారుల అండ కూడా అతనికి ఉన్నట్టుగా అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో టెండర్లు ఇప్పిస్తానని చెప్పి తమను డబ్బులు అడుగుతున్నాడని, ఇవ్వకపోతే తమ టెండర్లలో కొర్రీలు పెడుతున్నాడని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.
రూల్స్ ప్రకారమే కొన్నాం
హీమోగ్లోబిన్ స్ట్రిప్స్ రూల్స్ ప్రకారమే కొన్నాం. స్ట్రిప్స్కు సంబంధించి రేటు కాంట్రాక్ట్ ఉండటం వల్లే, టెండర్లు లేకుండా నేరుగా పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాం. స్ట్రిప్స్తో పాటు ఇతర రీఏజెంట్స్ కూడా కలిపి కొన్నందున ఏపీ కంటే, మనకు ఎక్కువ రేటు పడింది. ఏపీలో తక్కువకు అమ్మడంపై ఆస్పెన్ కంపెనీకి నోటీసులిచ్చి వివరణ తీసుకున్నాం. ఏపీ కేవలం స్ట్రిప్స్ మాత్రమే కొనింది. మనం స్ట్రిప్స్, కంట్రోల్స్, స్టెరైల్ స్వాబ్ కూడా తీసుకున్నాం. ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పాం. కంపెనీల నుంచి డబ్బులు అడిగినట్టు . ఎవరైనా ఫిర్యాదు చేస్తే, విచారణ జరుపుతాం.
- చంద్రశేఖర్రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ