
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92 లో ఓ కారు అదుపు తప్పి ఇద్దరు వ్యక్తులను ఢీకొంది. ఈ ఘటనలో ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92లోని ఫెడరల్ బ్యాంకు వద్ద శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఫెడరల్ బ్యాంకులో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ఓ ఎలక్ట్రీషియన్ రిపేర్ చేసేందుకు అక్కడకు వచ్చాడు. ఆ భవనంలో వాచ్ మెన్ గా పని చేసే బి. నాగేష్ అనే వ్యక్తితో కలసి రోడ్డు పక్కన మరమ్మత్తులు చేస్తుండగా.. అకస్మాత్తుగా ఓ కారు అతి వేగంగా వచ్చి , వారిని ఢీ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడిపిన ఆగంతకులు.. తమను ఎవరూ గుర్తించకూడదని కారు నంబర్ కనపడకుండా నంబర్ ప్లేట్ ని తొలగించి అక్కడి నుంచి జారుకున్నారు. అయితే సీసీ టీవీ ఫుటేజీలో కారు నంబరు AP39CV9999 గా తెలిసింది. ఇది ఏపీకి చెందిన ఒక ఎమ్మెల్సీ దని విశ్వసనీయ సమాచారం.