కానిస్టేబుల్​పై దాడి చేసి పరారైన ఇద్దరు దొంగల అరెస్ట్

కానిస్టేబుల్​పై దాడి చేసి పరారైన ఇద్దరు దొంగల అరెస్ట్

శంషాబాద్, వెలుగు:  కానిస్టేబుల్​పై దాడి చేసి పారిపోయిన ఇద్దరు దొంగలను మైలార్ దేవ్ పల్లి పోలీసులు  అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్​నుమాకు చెందిన కరీం ఖాన్(20), మతిన్ ఖాన్(23) ఇద్దరు యువకులు గంజాయికి బానిసయ్యారు. ఈజీ మనీ కోసం ఒంటరిగా వెళ్లే వారిని కత్తులతో బెదిరించి డబ్బు, బంగారాన్ని దొంగిలించేవారు. 

ఈ నెల 20న కరీం, మతిన్ ఇద్దరూ డమ్మీ గన్, 2 కత్తులు, రెడ్ చిల్లీ  స్ప్రే బాటిళ్లను బ్యాగ్​లో పెట్టుకొని రాత్రి 7 గంటలకు మైలార్ దేవ్ పల్లి నుంచి జల్ పల్లిలోని వాంబే కాలనీకి స్కూటీపై వచ్చారు. లక్ష్మీగూడలో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో అప్పటికే ఆ ఏరియాలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. బైక్ పై వస్తున్న వీరిని ఎక్సైజ్ కానిస్టేబుల్ లింగయ్య ఆపాడు. తనిఖీ చేస్తుండగానే.. ఇద్దరు దొంగలు రెడ్ చిల్లీ స్ర్పేను కానిస్టేబుల్ పై కొట్టి బైక్​ను అక్కడే వదిలేసి పారిపోయారు. 

ఈ ఘటనపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన మైలార్​దేవ్ పల్లి పోలీసులు ఇద్దరు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం కరీం, మతిన్​ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైక్ తో పాటు  డమ్మీ గన్, రెండు కత్తులు, రెడ్ చిల్లీ స్ప్రే బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.