హయత్నగర్లో దారుణం జరిగింది. స్థానిక రాఘవేంద్ర కాలనీలో ఒకే రూంలో ఇద్దరు యువతులు ప్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు పాల్పడిన యువతులు గౌతమి, మమతగా గుర్తించారు. వీరిద్దరూ ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. వీరి ఆత్మహత్యకు ఇంకా ఎలాంటి కారణాలు తెలియరాలేదు.
మమత స్వస్థలం మహబూబ్ జిల్లా పోతునపల్లి. గత కొన్నేళ్ళ క్రితం తల్లిదండ్రులతో కలిసి నగరానికి వచ్చి ఇక్కడే నివాసముంటోంది. గౌతమి స్వస్థలం కర్నూల్ జిల్లా మాధవరం మండలం వెల్దోడు గ్రామం. మమత తల్లిదండ్రులు గత బుధవారం మహబూబ్ నగర్ లోని తన బంధువుల వివాహానికి వెళ్లారు. తమ్ముడు రఘుతో కలిసి మమత రెండు రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. అయితే శుక్రవారం రఘు స్కూల్ కు వెళ్లిన సమయంలో మమత ఇంటికి గౌతమి వచ్చింది. కారణాలు తెలియదు కానీ ఇద్దరూ ఒకే రూంలో ప్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.