- ఇచ్చిన వాగ్ధానాలనూ దాటవేసే ప్రయత్నం
- కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్చీఫ్ కిషన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్పార్టీ తెలంగాణ యువతను మరోసారి మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్చీఫ్ కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టడంలో ఆపార్టీకి ఘన చరిత్ర ఉందని విమర్శించారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయిందంటూ ట్వీట్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజుల ముందు.. 25 నవంబర్ 2023 రోజున కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వార్తా పత్రికలలో ప్రకటన ఇచ్చిందని.. 1 ఫిబ్రవరి 2024 నాటికి గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఆ హామీని నెరవేర్చలేదన్నారు.
‘నిన్ననే ఒకటో తేదీ.. ఇది ఫిబ్రవరి నెలే. ఇంతవరకూ గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. నమ్మి ఓటేసిన యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇదే తరహాలో ఇతర వాగ్ధానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతోంది’ అని ఆరోపించారు.