
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీలు నైపుణ్యంతో కూడిన ఉపాధి అందించే కోర్సులను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. సిటీలోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ‘భారతదేశంలో ఉన్నత విద్య– సమస్యలు’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే సదస్సు ఆదివారం ప్రారంభమైంది. దీనికి చీఫ్ గెస్టుగా హాజరైన లింబాద్రి మాట్లాడారు. దేశంలో ఉన్నత విద్యను అభ్యసించేవారి సంఖ్య గణనీయ వృద్ధి సాధించిందని తెలిపారు.
దేశంలో ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్య 28.4 శాతంగా ఉంటే.. తెలంగాణలో 40 శాతంగా ఇది ఉందని చెప్పారు. రాష్ట్రానికి ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల శాతం బాగా పెరిగిందని వెల్లడించారు. దీంట్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పాత్ర కీలకంగా ఉందని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో వర్సిటీ మాజీ వీసీ వీఎస్ప్రసాద్, వర్సిటీ వీసీ సీతారామరావు, రిజిస్ర్టార్ ఏవీఆర్ ఎన్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ఘంటా చక్రపాణి తదితరులు మాట్లాడారు.