కేసీఆర్​ అవినీతిపై సీబీఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే: ఉత్తమ్​

కేసీఆర్​ అవినీతిపై సీబీఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే: ఉత్తమ్​
  • కేసీఆర్​ అవినీతిపై సీబీఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే: ఉత్తమ్​
  • ఇతర రాష్ట్రాల లీడర్లపై కేసులు పెట్టినోళ్లు మీ మిత్రుడ్ని ఎందుకు వదిలేసిన్రు?
  • అన్నీ తెలిసి కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎట్లిచ్చింది? 
  • కాళేశ్వరంపై ఈ వారంలోనే జ్యుడీషియల్​ ఎంక్వైరీ మొదలు
  • ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ అవినీతి గురించి కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ.. ఇంకేదో అంటూ మాట్లాడుతున్నారని, పదేండ్ల నుంచి కేంద్రంలో వాళ్ల ప్రభుత్వమే ఉండగా ఏం చేశారని రాష్ట్ర ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్​స్కామ్​లో ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ‘‘కేసీఆర్​లక్షల కోట్లు దోచుకున్నట్లు కిషన్​రెడ్డి అంటున్నరు. కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్లే కదా! మరి, ఎందుకు జైల్లో పెట్టలేదు? బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాష్ట్రంలోని కాంగ్రెస్  ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నయ్​. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న కర్నాటక, రాజస్థాన్, హిమాచల్​ప్రదేశ్​సహా ఇతర రాష్ట్రాల్లోని నాయకులపై కేసులు పెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలకు తెలంగాణలో తమ ఫ్రెండ్​కేసీఆర్​ అవినీతి కనిపించలేదా? ఎందుకు కేసీఆర్​పై సీబీఐ, ఈడీ కేసులు పెట్టలేదు? పెడుతామంటే ఎవరు ఆపిండ్రో చెప్పాలి” అని నిలదీశారు. 

ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​షా కాళేశ్వరం ప్రాజెక్టు  కేసీఆర్​కుటుంబానికి ఏటీఎంగా మారిందని ఎన్నోసార్లు అన్నారని, మరి వాళ్లు ఎందుకు ఎంక్వైరీ చేయించలేదని, దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో చెప్పాలని కిషన్​రెడ్డిని ఆయన డిమాండ్​ చేశారు. కాళేశ్వరంపై జ్యుడీషియల్​ఎంక్వైరీ చేయిస్తామని తాము చెప్పామని, అది ఈ వారంలోనే మొదలు పెడతామని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం సెక్రటేరియెట్​ మీడియా సెంటర్​లో మంత్రి ఉత్తమ్​ మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం దరఖాస్తు చేసినట్లు అప్పటి బీఆర్ఎస్​ప్రభుత్వం చెప్తే.. ఎలాంటి అప్లికేషన్​రాలేదని కేంద్ర ప్రభుత్వం నేను అప్పట్లో పార్లమెంట్​లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.ఈ రెండు పార్టీల తీరుతో భవిష్యత్ ​తరాలపై మోయలేని అప్పుల భారం పడింది” అని మండిపడ్డారు. 

ప్రాజెక్టుకు అప్పులెట్లిచ్చిన్రు?

కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లతో కేంద్రం అనుమతి ఇచ్చిందని, తర్వాత దాన్ని రూ.1.27 లక్షల కోట్లకు పెంచేందుకు గ్రీన్​సిగ్నల్​ఇచ్చిందని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. ప్రాజెక్టు రీ డిజైనింగ్​కేంద్రంలోని వివిధ ఏజెన్సీలు ఎలా అనుమతులు ఇచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. ‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ఇరిగేషన్​ప్రాజెక్టుకు కూడా కార్పొరేషన్లు లోన్లు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పవర్​ఫైనాన్స్​కార్పొరేషన్, రూరల్​ఎలక్ట్రిఫికేషన్​కార్పొరేషన్​రూ.60 వేల కోట్ల లోన్లు ఇచ్చాయి. నాబార్డులు, ఇతర బ్యాంకులు అప్పులిచ్చాయి. అప్పులు ఇచ్చిన సంస్థలకు ప్రాజెక్టు పనులను తనిఖీ చేసే బాధ్యత లేదా? బీఆర్ఎస్, బీజేపీ కలిసి దోచుకునేందుకే లోన్లు ఇచ్చారా?” అని మండిపడ్డారు. గత ఏడాది అక్టోబర్​21న మేడిగడ్డ పిల్లర్లు కుంగినప్పటి నుంచి దానిపై కేసీఆర్​నోరు విప్పలేదని అన్నారు. కనీసం మీడియాను కూడా మేడిగడ్డ దగ్గరికి వెళ్లనివ్వలేదని, తాను ఇరిగేషన్​శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఇతర మంత్రులు, మీడియాను వెంటబెట్టుకొని మేడిగడ్డకు వెళ్లానని మంత్రి ఉత్తమ్​ పేర్కొన్నారు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

ఇరిగేషన్​పై త్వరలో శ్వేతపత్రం

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ ఖర్చంతా నిర్మాణ సంస్థ ఎల్​అండ్​టీనే భరిస్తుందని మంత్రి ఉత్తమ్​ స్పష్టం చేశారు. ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​పై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్​కలిసి 3,500 రోజులు పని చేశాయని, ఇరిగేషన్​శాఖలో అవినీతి కూడా ఆ రెండు పార్టీలు కలిసే చేశాయని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్​పదేండ్లు అధికారంలో ఉన్నాయని.. తాము వచ్చి 20 రోజులు కూడా కాలేదని, తమను బద్నాం చేసేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన అన్నారు.