వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ముందుగా అర్చకులు స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. మంగళవారం (డిసెంబర్ 30) తెల్లవారుజామున 1.25 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఆ క్షణాన్ని వీక్షించేందుకు భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో ఎదురుచూశారు. ఈ వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
వైకుంఠ ద్వార దర్శనాల ప్రారంభంలో ముందుగా ప్రముఖులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వారం గుండా బయటకు వచ్చారు. ఆలయానికి వచ్చిన సీఎంకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు సీఎంకు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు చేశారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక ఆశీస్సులు పొందారు.
మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. ఈ ప్రత్యేక దర్శనం మొత్తం పది రోజుల పాటు కొనసాగనుంది. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి వరకు భక్తులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి.
భక్తుల సౌకర్యార్థం మొదటి మూడు రోజులు, అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో, ముందుగా టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఈ టోకెన్లను టీటీడీ ముందుగానే కేటాయించింది. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు మరియు టోకెన్ ప్రింట్ కాపీ తీసుకురావాల్సి ఉంటుంది.
వైకుంఠ ఏకాదశి రోజున మంగళవారం ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా అలంకరించిన స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం బుధవారం ద్వాదశి పండుగ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఇది అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు.
టోకెన్లు లేని భక్తుల కోసం జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు వివిధ సమయాల్లో వేర్వేరు ప్రవేశ మార్గాల ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. టైంస్లాట్ టోకెన్ ఉన్న భక్తులను మంగళవారం తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 11 గంటల వరకు కృష్ణతేజ ప్రవేశమార్గం ద్వారా లోపలికి అనుమతిస్తారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టోకెన్ ఉన్నవారిని ఏటీజీహెచ్ ప్రవేశ ద్వారం ద్వారా పంపుతారు.
సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం మార్గం ద్వారా దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే ఎస్ఈడీ, శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన భక్తులను వారికి కేటాయించిన సమయాల్లో కోటా ప్రకారం అనుమతిస్తారు. చివరి మూడు రోజుల్లో స్థానిక భక్తుల కోసం రోజుకు 5 వేల మంది చొప్పున ఈ-డిప్ విధానంలో టోకెన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం మీద, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల సౌకర్యం, భద్రత, క్రమబద్ధమైన దర్శనాల కోసం టీటీడీ చర్యలు చేపట్టింది.
వైకుంఠ ద్వార దర్శనంలో తరించిన ప్రముఖులు
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కుటుంబ సభ్యులు
- సినీనటుడు నారా రోహిత్ దంపతులు
- రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్
- సినీ నిర్మాత డివివి దానయ్య
- మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ,కుమార్తెలు సుస్మిత,శ్రీజ
- రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి
- తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
- రాష్ట్ర మంత్రి సత్యకుమార్
- రాష్ట్ర శాసన సభాపతులు అయ్యన్నపాత్రుడు, రఘురామ కృష్ణంరాజు
- కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు,రాష్ట్రమంత్రి నిమ్మల రామానాయుడు
