కొడంగల్,వెలుగు: గల్లీలో ఎవరున్నా...ఢిల్లీ లో మోదీ రావాలని, ఆయనతోనే ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్గా ఎదిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. గురువారం కొడంగల్లో విజయ సంకల్ప యాత్ర చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్ షోలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. రైలు, రోడ్లు, సాగు నీటి ప్రాజెక్టులు, సామాన్యులకు ఇండ్లు, ఆస్పత్రులు కావాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు.
వికారాబాద్, కృష్ణ రైల్వే లైన్కు సర్వే పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామననారు. రాష్ట్రంలో 10 నుంచి12 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటేస్తే... ఏట్లో వెసినట్లే అని విమర్శించారు. కేంద్రంలో రాహుల్ ప్రధాని కావడం ఎప్పటికీ జరగదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్అవినీతి, అరాచక, కుటుంబపాలన నుంచి ప్రజలు విముక్తి పొందారని ఆమె పేర్కొన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్రెడ్డి, శాంతకుమార్ పాల్గొన్నారు.