ఏప్రిల్ 25 నుంచి ఓటరు స్లిప్ లు పంచుతం : రాహుల్ శర్మ

ఏప్రిల్ 25 నుంచి ఓటరు స్లిప్ లు పంచుతం : రాహుల్ శర్మ

వికారాబాద్, వెలుగు :  జిల్లాలో ఓటర్ స్లిప్ లను గురువారం నుంచి పంపిణీ చేస్తామని వికారాబాద్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్ పరిధి వికారాబాద్ లో పనిచేసే సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇంటింటికి ఓటర్ స్లిప్ లు పంచడంతో పాటు ఓటర్ గైడ్ ను కూడా అందించాలని సూచించారు. గ్రామాల్లో, మున్సిపాలిటీలో  బూత్ స్థాయి అధికారులు  ఓటర్ స్లిప్ ల పంపిణీలో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు. 

ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్  అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వయోవృద్ధులు, వికలాంగ ఓటర్లకు వీల్ చైర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. అధికారులు సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నిక సామగ్రిని చేరవేసేందుకు వాహనాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి జోసెఫ్ కు సూచించారు. ఈ సమీక్షలో వికారాబాద్, బంట్వారం తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ప్రవీణ్  పాల్గొన్నారు.