
వికారాబాద్ జిల్లా : ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్నను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరుతూ తాండూర్ మున్సిపల్ కార్యాలయం ముందు కాంగ్రెస్, సీపీఐ, జన సమితి పార్టీల కౌన్సిలర్లు, నాయకులు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మున్సిపల్ చైర్ పర్సన్ దర్జాగా దొంగ ఓటు వేసి వచ్చారని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ నమోదు చేసుకున్న ఓటు రిజెక్ట్ అయ్యిందని చెప్పినా కూడా తన తోడికోడలు పేరు తాటికొండ స్వప్న అని ఉండడంతో.. ఆ పేరుపై చైర్ పర్సన్ ఎన్నికల్లో దొంగ ఓటు వేశారన్నారు. ఈ దొంగ ఓటుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను అధికారుల ద్వారా సేకరించామని రాష్ట్ర ఎన్నికల అధికారితో పాటు.. జిల్లా కలెక్టర్ కూడా ఆమెపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ విధంగా దొంగ ఓటు వేయడం వల్ల తాండూర్ నియోజకవర్గం పరువు పోయిందన్నారు. వెంటనే ఆమెని మున్సిపల్ చైర్మన్ విధుల నుంచి తొలగించాలని ధర్నా చేశారు. ఆమెపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోకపోతే .. ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు కౌన్సిలర్లు. అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ పార్టీని అడ్డంపెట్టుకుని గతంలో కూడా మున్సిపాలిటీ పరిధిలో పలు అవకతవకలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని అధికారులు వెంటనే చైర్మన్ పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కౌన్సిలర్లు.