- గ్రామానికి కరెంట్ తీసేయాలంటూ పవర్ స్టేషన్ కూ ఫోన్
- ట్రాప్ చేసి.. చుట్టుముట్టి.. ఇంటిపై నుంచి బుల్లెట్ల వర్షం కురిపించిన దుబే గ్యాంగ్
- అతడి ముఠాకు చెందిన దయాశంకర్ అగ్నిహోత్రి అరెస్టు
- విచారణలో విస్తుబోయే నిజాలు
- ఔరయా జిల్లాలో కారు సీజ్.. అందులోనే పారిపోయిన దుబే?
- ఇండియా, నేపాల్ బోర్డర్లో వాంటెడ్ పోస్టర్లు
సంచలనం సృష్టించిన కాన్పూర్ పోలీసుల ఎన్కౌంటర్ కేసులో కుట్ర కోణం బయటపడింది. డీఎస్పీ ర్యాంకు అధికారి సహా 8 మంది పోలీసులు చనిపోయిన ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ వికాస్ దుబేకు లోకల్ పోలీసులే సాయం చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు రైడ్కు వస్తున్నట్లు అతడికి ఫోన్ చేసి చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. దుబే ముఠాలోని కీలక సభ్యుడు దయాశంకర్ అగ్నిహోత్రి ఆదివారం పలు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు.
ఫోన్ చేసి చెప్పారు
దయా శంకర్ను పోలీసులు కల్యాణ్పూర్లో అరెస్టు చేశారు. అతడిని విచారించగా దుబేను పట్టుకునేందుకు యూపీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన విషయాన్ని స్థానిక పోలీసులే చెప్పినట్లు అతడు వెల్లడించాడు. ‘‘పోలీసులు వస్తున్నట్లు దుబేకు ఫోన్ వచ్చింది. వెంటనే అతడు మరో 25 నుంచి 30 మందిని పిలిపించుకున్నాడు. తర్వాత పోలీసులపై కాల్పులు జరిపారు” అని అగ్నిహోత్రి చెప్పాడు.
పోలీసులే కరెంట్ తీయించారు
ఎన్కౌంటర్ జరగడానికి కొద్దిసేపటి ముందు ఊరిలో కరెంటు నిలిపివేయాలని స్థానిక పోలీసుల నుంచి పవర్ స్టేషన్కు ఆదేశాలు వెళ్లినట్లు దర్యాప్తులో బయటపడింది. ‘‘జులై 3న చౌబేపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ‘బిక్రూ గ్రామానికి కరెంటు కట్ చేయండి’ అని చెప్పారు’’ అని శివ్లీ పవర్ స్టేషన్ ఆపరేటర్ ఛత్రపాల్ వెల్లడించాడు.
దుబే ఫోన్లో 20 మంది ఆఫీసర్ల నంబర్లు
దుబే ఫోన్ డేటాను పోలీసులు రికవర్ చేశారు. అందులో 20 మంది పోలీస్ ఆఫీసర్ల నంబర్లున్నట్లు గుర్తించారు. ఎన్కౌంటర్కు ముందు ఇద్దరు పోలీసులతో చాలా సార్లు మాట్లాడినట్లు తెలిసింది. ఇందులో చౌబేపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఒకరు ఉన్నారు. ఎన్కౌంటర్ జరిగిన బిక్రూ విలేజ్ ఈ స్టేషన్ పరిధిలోకే వస్తుంది. చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ వినయ్ తివారీని సస్పెండ్ చేసి విచారిస్తున్నారు. ‘‘ఎన్కౌంటర్ టైమ్లో తివారీ అక్కడికి వెళ్లిఉంటే.. క్రిమినల్స్ను ఎదుర్కొని ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది” అని కాన్పూర్ ఐజీ అన్నారు.
ఇంట్లోనే బంకర్ కట్టుకున్నడు
శనివారం కూల్చేసిన దుబే ఇంట్లో బంకర్ను పోలీసులు గుర్తించారు. అందులో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఐజీ అగర్వాల్ చెప్పారు. పోలీసులపై 200 నుంచి 300 రౌండ్లు కాల్పులు జరిపారని, కాడ్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
మధ్యప్రదేశ్ లేదా రాజస్థాన్కు..
దుబేను పట్టుకునేందుకు ఇప్పటికే 25 పోలీస్ టీమ్స్ను ఏర్పాటు చేశారు. దుబే పారిపోయాడని అనుమానిస్తున్న ఓ కారును ఔరయా జిల్లాలో సీజ్ చేశారు. మధ్యప్రదేశ్ లేదా రాజస్థాన్కు దుబే వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రెండు రాష్ర్టాలను అలర్ట్ చేశారు. సమాచారం ఇచ్చిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటించారు.
గొడ్డలితో తల నరికారు
8 మంది పోలీసు డెడ్ బాడీల పోస్టుమార్టం రిపోర్టుల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ‘‘బిల్ హౌర్ సర్కిల్ ఆఫీసర్ దేవేంద్ర మిశ్రా తలను గొడ్డలితో నరికినట్లు తెలిసింది. ఆయన కాళ్లను ముక్కలు చేశారు. శరీరమంతా ఛిద్రమైంది. మరో ఎస్సైపై పాయింట్ బ్లాక్ రేంజ్లో ఏకే 47తో బుల్లెట్ల వర్షం కురిపించారు’’ అని పోస్టుమార్టం రిపోర్టు చెప్పింది.
మావోయిస్టుల తరహాలో దాడి
మావోయిస్టుల తరహాలో వికాస్ గ్యాంగ్ దాడి చేసినట్లు ఐజీ అగర్వాల్ చెప్పారు. ‘‘ఇలాంటి గెరిల్లా తరహా ఆకస్మిక దాడి ఉత్తరప్రదేశ్లో గతంలో ఎన్నడూ జరగలేదు. మొదట రోడ్డుపై జేసీబీని అడ్డుగా పెట్టి ఉచ్చు బిగించారు. పోలీ సులు రాగానే రూఫ్టాప్లపై నుంచి కాల్పులు జరిపారు. ఇది మావోయిస్టులు అనుసరించే వ్యూహం’’ అని వివరించారు. 60 మంది కలిసి దాడి చేసినట్లు భావిస్తున్నామన్నారు.