
న్యూఢిల్లీ : తనకు లభించిన ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న, అర్జున్ అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. న్యాయం కోసం రెజర్లు చేస్తున్న పోరాటంలో ఈ అవార్డులకు విలువ లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి తన నిర్ణయాన్ని ఓ లేఖ ద్వారా తెలియజేసింది. ‘మహిళల జీవితాలు, సాధికారత, అభ్యున్నతి గురించి మాట్లాడే ఫ్యాన్సీ గవర్నమెంట్స్ ఇచ్చే ప్రకటనల మాదిరిగా మా జీవితాలు లేవు. నేను సాధించిన ఖేల్రత్న, అర్జునకు ఇప్పుడు విలువ లేదు. ఈ దేశంలో ప్రతి మహిళ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. కాబట్టి పీఎం సార్.. నా అవార్డులను మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే మా ప్రయత్నంలో ఈ అవార్డులు మాకు భారం కావొద్దు’ అని ఫోగట్ లేఖలో పేర్కొంది.