
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: ప్రతిభకు కొదవలేదు.. ఆటకు తిరుగులేదు.. రికార్డులకు రారాజు.. మంచి నీళ్లు తాగినంత సులువుగా సెంచరీలు కొడతాడు.. క్రీజులో నిలబడితే గంటలకొద్దీ ఏకధాటిగా వరల్డ్ క్లాస్ బౌలర్లందర్ని ఉతికి ఆరేస్తాడు. ఇంటర్నేషనల్లో టన్నుల కొద్దీ పరుగులు చేసినా.. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఇండియా క్రికెట్కు పోస్టర్ బాయ్గా మారిన విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. 18 ఏండ్లుగా చేస్తున్న పోరాటంతో 18వ నెంబర్ జెర్సీ ప్లేయర్ 18వ సీజన్లో కప్ కొట్టడం అతని కెరీర్కే హైలెట్.
ఇప్పటివరకు ఐపీఎల్లో మూడు ఫైనల్స్ ఆడాడు. అన్నింటిలోనూ పరుగుల వరద పారించాడు. మెగా లీగ్లో 8500 రన్స్ కంటే ఎక్కువే సాధించాడు. ఒకే సీజన్లో 972 రన్స్ కూడా చేశాడు. ప్రతీ మ్యాచ్కు ముందు 18 ఏండ్ల కుర్రాడిలా తిరుగులేని కొత్త శక్తితో గ్రౌండ్లోకి అడుగుపెడతాడు. తనలోని శక్తిని మొత్తం ధారపోసి మ్యాచ్లు గెలిపిస్తాడు. కానీ కప్ వరకు వచ్చేసరికి మాత్రం ఆర్సీబీ బోల్తా కొడుతూ వస్తోంది. జట్టుగా ఆడే ఆటలో వ్యక్తిగత ప్రతిభ ఒక స్థాయి వరకు మాత్రమే తీసుకెళ్తుంది. కానీ ట్రోఫీ గెలవాలంటే మిగతా ప్లేయర్లు కూడా మెరవాలి. ఈ సీజన్లో ఆర్సీబీ అదే చేసింది.
17 ఏండ్ల శ్రమ..
ఈ ఐపీఎల్ ట్రోఫీ వెనక కోహ్లీ 17 ఏండ్ల కఠోర శ్రమ దాగి ఉంది. ఈ క్రమంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ వాటికి ఏనాడూ ప్రతిస్పందించలేదు. విమర్శలు వచ్చిన ప్రతిసారి తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. అందుకే ఒకే ఫ్రాంచైజీకి 18 ఏండ్లు ఆడాడంటే విరాట్ అంకితభావం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఆర్సీబీ అంటే కోహ్లీకి అదో భావోద్వేగం, అదో వారసత్వం.. వీటన్నింటిని మించి ఫ్యాన్స్తో కింగ్ కోహ్లీకి ఉండే బంధం.
క్రిస్ గేల్, డివిలియర్స్లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లందరూ ఈ ఫ్రాంచైజీకి ఆడారు. వాళ్ల ఆటతో వరుసగా విజయాలు సాధించిపెట్టారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపారు. కానీ ఫైనల్కు వచ్చేసరికి ఏదో తెలియని భయం వెంటాడేది. ఇప్పుడు ఆ భయాన్ని కింగ్ కోహ్లీ తుడిచిపెట్టాడు. తనకు మాత్రమే సాధ్యమైన అద్భుత నైపుణ్యంతో చిన్నస్వామి స్టేడియంలోని అల్మారాలోకి కళ్లు మిరుమిట్లు గొలిపే ఐపీఎల్ కప్ను తెచ్చిపెట్టాడు.
ట్యాగ్ లైన్కు న్యాయం..
‘ఈ సాలా కప్ నమదే’ ఆర్సీబీ ట్యాగ్ లైన్ ఇది. లీగ్ ఆరంభానికి ముందు సోషల్ మీడియాలో ఇది హోరెత్తిపోతుంది. కానీ ఇప్పుడు దీనికి సరైన న్యాయం చేకూరింది. ఈ సీజన్ను పూర్తి భిన్నంగా మొదలుపెట్టిన ఆర్సీబీ వ్యక్తిగత ప్రతిభపై కాకుండా వేలం నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. తెలివిగా ప్లేయర్లను కొనుగోలు చేసి వాళ్లపై ఒత్తిడి లేకుండా చూసుకుంది. వాళ్లలో ఎక్కడో దాగిన నైపుణ్యాన్ని అద్భుతంగా వెలికి తీసింది. ఇది కోహ్లీ ఆటకు మరింత ఉపయోగపడింది.
స్టార్ ట్యాగ్తో కాస్త ఇబ్బంది ఎదుర్కొనే విరాట్ ఈసారి మరింత స్వేచ్ఛగా ఆడాడు. ఒకవేళ తాను ఔటైనా మ్యాచ్లు గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్లు ఉండటం బాగా కలిసొచ్చింది. అందుకే ఈ ఏడాది ఆర్సీబీలో ఎక్కడా ఒన్ మ్యాన్ షో కనబడలేదు. అయినప్పటికీ టీమ్ తరఫున కోహ్లీయే అత్యధిక రన్స్ చేశాడు. ఓపెనింగ్ పార్ట్నర్గా ఫిల్ సాల్ట్ను తీసుకోవడం మాస్టర్ స్ట్రోక్గా చెప్పొచ్చు. ఈ ఇద్దరి జోడీ ఆరంభంలోనే వండర్స్ క్రియేట్ చేసింది.
ఇక బౌలింగ్లో హాజిల్వుడ్ రాక టీమ్ డైనమిక్స్ను మార్చేసింది. భువనేశ్వర్ కామ్గా ఒత్తిడి పెంచితే మధ్యలో యష్ దయాల్ సైలెంట్గా వికెట్ తీసి బ్రేక్స్ ఇచ్చాడు. స్పిన్లో క్రునాల్ పాండ్యా, సుయాశ్ శర్మ టర్నింగ్ సూపర్బ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ యుగపు ఐకాన్గా చేయగలిగినదంతా చేసిన విరాట్ కోహ్లీ కప్ గెలవగానే కన్నీళ్ల పర్యంతంతో గ్రౌండ్లోనే మోకరిల్లాడు.
ప్రశాంతంగా నిద్రపడుతుంది
18 ఏండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్ గెలవడం నమ్మశక్యం కాని అనుభూతినిస్తోంది. ఈ విజయాన్ని మా టీమ్మేట్స్కు, మమ్మల్ని ఎంతగానో ఆదరించిన అభిమానులకు అంకితం చేస్తున్నా. ఇక మా నినాదం ఈ సాలా కప్ నమ్దే కాదు.. ఈసాలా కప్ నమ్దూ. ఏబీ డివిలియర్స్ కూడా ఈ విజయంలో భాగస్వామే. తను మాతో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవాలి.
నా కెరీర్లో ఇది ఎంతో ముఖ్యమైన విక్టరీ. నా మనసంతా బెంగళూరుతోనే ఉంది. అందుకే ఈ జట్టుతో గెలవడం నాకు చాలా స్పెషల్. నేను ఐపీఎల్ ఆడేంత వరకు ఆర్సీబీతోనే ఉంటా. ఇంత పెద్ద టోర్నమెంట్లో గెలవడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ రాత్రి నాకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఇకపై నేను ఆడే కొద్ది సంవత్సరాల్లోనూ నా పూర్తి శక్తిని ఇవ్వాలనుకుంటున్నా.
ఈ ప్రస్తుత ఆర్సీబీ యాజమాన్యం, ఆటగాళ్ల బృందం చాలా గొప్పది. అందరి సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైంది. ఇది మా అందరి విజయం, బెంగళూరు విజయం. ఈ ఐపీఎల్ ట్రోఫీ చాలా గొప్పదే అయినా నా దృష్టిలో టెస్ట్ క్రికెట్టే ఎప్పుడూ అన్నింటికన్నా గ్రేట్. యువ ఆటగాళ్లందరూ టెస్ట్ క్రికెట్ను గౌరవించాలి..
- విరాట్ కోహ్లీ