చెర్నోబిల్. అనగానే అణుధార్మికత గుర్తొస్తది. 1986లో ఉక్రెయిన్లోని అణు విద్యుత్ కేంద్రంలో విస్ఫోటం జరిగి రేడియో ధార్మికత వందలాది కిలోమీటర్ల మేర వ్యాపించింది. దీంతో లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ కేంద్రం చుట్టూ 30 కిలోమీటర్లను నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. తర్వాత దాన్ని మరింత పెంచారు. ఆ నిషేధిత ప్రాంతం లండన్ విస్తీర్ణంతో పోలిస్తే రెండింతల కన్నా ఎక్కువ. అలాంటి రేడియో యాక్టివిటీ ఉన్న ప్రాంతంలో పండిన ధాన్యం, అక్కడి నీటితో వోడ్కాను తయారు చేశారు సైంటిస్టులు. న్యూక్లియర్ ప్లాంట్ పేలుడు తర్వాత అక్కడ తయారైన తొలి ప్రొడక్ట్ ఇది. తయారు చేసిన కంపెనీ ‘ఆటమిక్’.
సైంటిస్టులే రెడీ చేశారు
బ్రిటన్కు చెందిన పోర్ట్స్ మౌత్ వర్సిటీ ప్రొఫెసర్ స్మిత్తో పాటు నిషేధిత ప్రాంతంలో పని చేసిన చాలా మంది రీసెర్చర్లు వోడ్కా తయారీలో పాలు పంచుకున్నారు. వోడ్కా తయారయ్యాక రేడియో అనలిటికల్ లేబొరేటరీ ఉన్న సౌతాంప్టన్ వర్సిటీకి పంపి ఏమైనా మలినాలున్నాయేమో చెక్ చేయమన్నారు. వాళ్లు పరిశీలించి అందులో రేడియో ధార్మికత లేదని తేల్చారు. దీంతో అక్కడి వోడ్కాను అమ్మేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఉక్రెయిన్లోని కీవ్లో ఉన్న హైడ్రోమీటియరోలాజికల్ యూనివర్సిటీకి చెందిన గెన్నడీ లాప్టావ్ కూడా చెర్నోబిల్ స్పిరిట్ కంపెనీలో భాగస్వామి.
వోడ్కానే ఎందుకు చేశారు?
దేన్నయినా డిస్టిల్ చేస్తే అందులోని మలినాలు తొలగిపోతాయని, అందుకే డిస్టిల్ చేసి తయారు చేసే వోడ్కాను ఉత్పత్తికి ఎంచుకున్నామని సైంటిస్టులు చెప్పారు. చెర్నోబిల్లో 1990 నుంచి ప్రొఫెసర్ స్మిత్ పని చేస్తున్నారు. ‘చెర్నోబిల్లో రేడియేషన్ హాట్స్పాట్స్ ఉన్నాయి. కానీ అక్కడి చాలా ప్రాంతాల్లో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలతో పోలిస్తే రేడియేషన్ తక్కువన్నారు. అక్కడ చాలా ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్నారు. చెర్నోబిల్ చుట్టుపక్కలున్న ప్రజలకు సరైన తిండి, ఉద్యోగం, ఆర్థిక వనరులు, హెల్త్ సర్వీసులు అందుబాటులో లేవు’ అని వివరించారు. చెర్నోబిల్ వోడ్కాను అమ్మగా వచ్చే సొమ్ముతో ఇక్కడి ప్రజలకు సాయం చేయాలనేదే తమ ప్లాన్ అని చెప్పారు. 30 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతంలో రేడియో యాక్టివిటీ కన్నా ఆర్థికాభివృద్ధి పెద్ద సమస్యవుతుందన్నారు. ఇప్పటికైతే ఒక్కటే బాటిల్ను రెడీ చేశారు. ఈ ఏడాది చివరి వరకు 500 బాటిళ్లను తయారు చేయనున్నారు.
