వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి చనిపోయింంది. నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతి.. ఆదివారం 9 గంటల 15 నిమిషాలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అటు ప్రీతి మరణ వార్త విని తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నారు. స్నేహితురాలు మృతితో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థినులు విలపిస్తున్నారు.
కాపాడలేకపోయాం..
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలోని పీజీ చదువుతున్న ప్రీతి.. కాలేజీలో సీనియర్ల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ కు యత్నించింది. గత ఐదు రోజులుగా నిమ్స్ లో మృత్యువుతో పోరాడిన ప్రీతి మరణించినట్లు ఆదివారం సాయంత్రం నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఎక్మో, వెంటిలేటర్ మీద నిమ్స్ ఆసుపత్రిలో ఆమెకు వైద్యం అందించారు. ప్రీతిని కాపడేందుకు తాము తీవ్రంగా ప్రయత్నించామని.. కానీ కాపాడలేకపోయామని నిమ్స్ వైద్యులు తెలిపారు.
మూడు సార్లు గుండె ఆగిపోయింది.
ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలోని పీజీ చదువుతున్న ప్రీతి.. వైద్య శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తుండేది. ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే డిపార్ట్మెంట్లో ASI గా పనిచేస్తున్నారు. హైదరాబాద్లోని బోడుప్పల్ వెస్ట్ బాలాజీ నగర్లో నివాసం ఉంటున్నారు. రోజూ హైదరాబాద్ నుంచి వరంగల్కు వెళ్లి వస్తోంది. అయితే సీనియర్ మెడికో సైఫ్ వేధింపులతో విసిగిపోయిన ప్రీతి తనకు తాను విషపు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమెను వరంగల్లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎం తరలించారు. అప్పటికే ప్రీతి ఆరోగ్యం విషమించింది. దీంతో వరంగల్ నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకొచ్చారు. నిమ్స్ కు తరలించే సమయంలో ప్రీతి గుండె మూడు సార్లు ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేసిన వైద్యులు.. మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారు.
బ్రెయిన్ పై ప్రభావం
నిమ్స్కు చేరుకున్న తర్వాత ప్రీతికి పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. అయితే విషపు ఇంజక్షన్ తీసుకోవడం వల్ల ప్రీతి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినట్లు డాక్టర్లు వెల్లడించారు. ముఖ్యంగా బ్రెయిన్ పై ప్రభావం చూపినట్లు చెప్పారు. శ్వాస తీసుకోవడంలోనూ ప్రీతి బాగా ఇబ్బంది పడిందని...ఈ పరిస్థితుల్లో న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షించిందని తెలిపారు.