పంజాబ్లో పాగా ఎవరిదో?
ఆమ్ ఆద్మీపార్టీపై పంజాబ్ ఓటర్లకు నమ్మకం పోయింది. బీజేపీ-ఎస్ఏడీ కూటమి పాలనవల్ల పెద్దగా తమకు ఒరిగిందేమీ లేదన్న భావన ప్రజల్లో ఉంది. అధికార కాంగ్రెస్పైనా పెద్దగా వ్యతిరేకతా లేదు. ఈ మూడు కీలకపార్టీలను పరిశీలిస్తే ఎవరికీ అనుకూల గాలులు వీస్తున్నట్టు చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఈనెల 19న పంజాబ్లోని 13 లోక్సభ సీట్లలో ఏపార్టీకి గెలుపుకు అనుకూల అంశాలు కనిపించడంలేదు. ‘మోడీ గాలి’ వీయడంలేదు. బీజేపీ- శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) కూటమి పైనా ఓటర్లు పెద్దగా ఆశలు పెట్టుకోవడంలేదు. గతంలో ఆ కూటమి రాష్ట్రాన్ని పాలించిననాటు చేదు అనుభవాలను ఓటర్లు గుర్తుచేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా…ఆపార్టీ పాలనపైనా పెద్ద వ్యతిరేకతా లేదు. ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ రెండేళ్ల పాలనే ఆపార్టీ గెలుపుపై ఆధారపడుతుందని అంచనావేస్తున్నారు.
ఆప్ ఎలా ఉంది?
2014 లోక్సభ ఎన్నికల్లో ఊహించని విజయాలను సొంతంచేసుకున్న ఆప్ ..ఈసారి ఎన్నికల్లో మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. పార్టీ స్థాపకుల్లోని చాల మంది ఆప్కు గుడ్బై చెప్పారు. పంజాబ్ శాఖ నాయకత్వంలో చీలిక వచ్చింది. ఎంపీలు ధర్మవిహార్ గాంధీ, హరీందర్ ఖల్సాలు హైకమాండ్ను ప్రశ్నించడంతో వాళ్లను 2015 ఆగస్టులో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్నుంచి పార్టీ శాఖలో సమస్యలు మొదలయ్యాయి. మరో సీనియర్ లీడర్, ఎమ్మెల్యే సుఖ్పాల్ ఖైరా ఈ ఏడాది పార్టీకి రాజీనామా చేసి సొంతంగా పంజాబీ ఏక్తా పార్టీని ఏర్పాటుచేశారు. సీనియర్ ఎమ్మెల్యేలు హెచ్.ఎస్. ఫూల్కా, బల్దేవ్ సింగ్లు పార్టీని వీడారు.

