- హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ మృతుల్లో 72% మంది ఎక్కువ గంటలు పని చేసినోళ్లే
- 16 ఏండ్లలో 29% పెరిగిన డెత్స్.. 2016లో 7.4 లక్షల మంది మృతి
- ఇండియాలోనూ మరణాలు ఎక్కువే
- డబ్ల్యూహెచ్వో స్టడీలో వెల్లడి
- వారానికి 40 గంటలు పని చాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఎక్కువసేపు పని చేసేవాళ్ల గుండె మస్తు వీకైపోతోంది. బ్రెయిన్కు కూడా ముప్పు ఎక్కువవుతోంది. పని గంటలతో ముడిపడి ఉన్న మరణాలూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా హార్ట్, బ్రెయిన్ స్ర్టోక్ మృతుల్లో 72 శాతం మంది వారానికి 55 గంటల కంటే ఎక్కువ పనిచేసిన వాళ్లే. ఈ వివరాలన్నీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్తో కలిసి 194 దేశాల్లో చేసిన స్టడీలో ఈ విషయాలు తెలిశాయంది. 2000 నుంచి 2016 వరకు అనేక అంశాలను స్టడీలో వివరించామని చెప్పింది.
ఆసియాలో ఎక్కువ
ప్రపంచవ్యాప్తంగా 2000 నుంచి 2016 మధ్య లాంగ్ వర్కింగ్ హవర్స్ పని చేసిన వాళ్లలో గుండె జబ్బుల మరణాలు 42 శాతం, స్ట్రోక్ మరణాలు 19 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్వో వివరించింది. ఇలాంటి మరణాలు 2016లో 7.45 లక్షలు నమోదయ్యాయని, 2000 నాటితో పోలిస్తే ఇవి 29 శాతం ఎక్కువని తెలిపింది. ఎక్కువసేపు పనిచేయడం వల్ల తెలియకుండానే ఒత్తిడి, మానసిక సమస్యలు పెరుగుతున్నాయని.. తర్వాతి దశలో ఈ ప్రాబ్లమ్స్ ప్రాణాంతకమవుతున్నాయని చెప్పింది. వారానికి 35 నుంచి 40 గంటలు పనిచేసిన వాళ్లతో పోల్చితే అంతకంటే ఎక్కువ గంటలు పనిచేసిన వాళ్లలో స్ర్టోక్ ముప్పు 35 శాతం ఎక్కువ ఉందని, గుండె జబ్బుల బారిన పడే ముప్పు 17 శాతం అధికంగా ఉందని వివరించింది. ఆగ్నేయ ఆసియా, దక్షిణ ఆసియా దేశాల్లో వర్కింగ్ హవర్ సంబంధిత మరణాలు ఎక్కువగా ఉన్నట్టు స్టడీలో తేలిందంది. అందులో ఇండియా కూడా ఉందని చెప్పింది. వర్కింగ్ హవర్స్ను వీలైనంత వరకు తగ్గించుకోవాలని, వారానికి 40 గంటల వరకే పని ఉండేలా చూసుకోవాలని సూచించింది.
ఇండియాలో డేంజర్బెల్స్
గుండె జబ్బులు, స్ర్టోక్ బారిన పడే వాళ్ల సగటు వయసు గతంలో 50 నుంచి 60 ఏండ్ల మధ్య ఉంటే ఇప్పుడు 40 నుంచి 50 ఏండ్లకు తగ్గింది. ప్రపంచ సగటు కంటే మన దేశ సగటు స్ర్టోక్ ఏజ్ ఇంకా తక్కువుంది. గతంలో చేసిన పలు సర్వేల ప్రకారం దేశంలో ఫస్ట్ స్ర్టోక్ 35 నుంచి 40 ఏండ్ల మధ్యలోనే వస్తున్నట్టు తెలుస్తోంది. బెంగళూరులోని శ్రీజయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియో వాస్కులర్ సైన్సెస్ ప్రొఫెసర్లు రెండేళ్ల పాటు 2,200 మంది గుండె జబ్బు పేషెంట్లపై స్టడీ చేశారు. ఆ స్టడీ వివరాలను గతేడాది విడుదల చేశారు. ఈ 2,200 మందిలో 35 ఏండ్ల లోపలే ఫస్ట్ టైమ్ స్ర్టోక్ వచ్చినవాళ్లు 35 శాతం మంది ఉన్నట్టు గుర్తించారు. నాన్ కమ్యునికబుల్ డిసీజెస్ (అంటు వ్యాధులు కానివి) సర్వేలోనూ మన దేశంలో కార్డియో వాస్కులర్ డిసీజెస్ ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు. ఇటీవలి నేషనల్ హెల్త్ ప్రొఫైల్ రిపోర్ట్ ప్రకారం గతేడాది 6.82 కోట్ల మందిని స్ర్కీన్ చేస్తే అందులో 16.14 లక్షల మందికి డయాబెటిస్, హైపర్ టెన్షన్, స్ర్టోక్, కార్డియో వాస్కులర్ సమస్యలున్నట్టు తేలింది. దేశంలో సడన్ స్ర్టోక్ ముప్పు యువతలో ఎక్కువగా పెరుగుతోంది.
కరోనాతో పెరిగిన ముప్పు
కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగిందని డబ్ల్యూహెచ్వో చెప్పింది. చాలా మంది రోజుకు 9 గంటలు, అంతకంటే ఎక్కువ సేపు పని చేస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఇప్పటికిప్పుడు ఆ ఎఫెక్ట్ తెలియకున్నా కొంత కాలం తర్వాత అనారోగ్య సమస్యలు మొదలవుతాయని అంటోంది. కంప్యూటర్లపై కూర్చుని ఎక్కువసేపు పనిచేసే వాళ్లు, వారానికి కనీసం 2 గంటలు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయట్లేదని.. దీని వల్ల వెయిట్ పెరగడం, మానసిక సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలన్స్ లాంటి సమస్యలు వస్తాయని చెబుతోంది. వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ కూడా హెల్త్పై ఎఫెక్ట్ చూపిస్తుందని వివరించింది.