
న్యూఢిల్లీ: గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్షానికి చేరుకోవడం భారత అంతరిక్ష రంగం చరిత్రలో కొత్త మైలురాయి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అంతరిక్షంలోకి భారతీయుడి జర్నీ పట్ల యావత్తు దేశమంతా సంతోషిస్తోందని అన్నారు. శుక్లా, ఆయనతోపాటు వెళ్లిన అమెరికా, పోలెండ్, హంగేరి ఆస్ట్రోనాట్లు ప్రపంచమంతా ఒకే కుటుంబం (వసుధైవ కుటుంబకమ్) అని చాటారని కొనియాడారు.
140 కోట్ల మంది కలల్ని శుక్లా మోసుకెళ్లారు: మోదీ
‘‘ఇండియా, హంగరీ, పోలెండ్, యూఎస్ ఆస్ట్రోనాట్ లను అంతరిక్షానికి పంపే మిషన్ విజయవంతంగా లాంచ్ కావడం సంతోషంగా ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న తొలి భారతీయుడిగా చరిత్రలో నిలవనున్న శుక్లాకు భారతీయుల తరఫున శుభాకాంక్షలు. ఆయనతోపాటు మిగతా ముగ్గురు ఆస్ట్రోనాట్లకూ అన్ని రకాలుగా విజయం చేకూరాలని కోరుకుంటున్నా” అని ప్రధాని ట్వీట్ చేశారు.