అనుమానాస్పద రీతిలో వివాహిత మృతి.. భ‌ర్త‌పై ఫిర్యాదు

అనుమానాస్పద రీతిలో వివాహిత మృతి.. భ‌ర్త‌పై ఫిర్యాదు

పాత‌బస్తీ: భర్త దెబ్బలు తాళలేక భార్య మృతి చెందిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శాలిబండ పీఎస్ పరిధిలోని అలీ నగర్ కు చెందిన అస్మా అనే వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఒంటిపై దెబ్బ‌ల‌తో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ గురువారం మృతి చెందింది. దీంతో ఉస్మానియా వైద్య సిబ్బంది శాలిబండ పోలీసులకు సమాచారం అందించారు. ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్న పోలీసులకు మృత దేహం పై పిడిగుద్దుల దెబ్బలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం పై మృతురాలి సోదరుడు తన బావ నే తన సోదరిని హత్య చేసాడని ఫిర్యాదు చేయగా.. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫలక్ నుమ ఏసీపీ ఎమ్‌.ఏ. మాజిద్ మృతురాలి ఇంటిని పరిశీలించి.. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. పోస్టుమార్టం తరువాత అసలు నిజం బయటపడుతుందని, కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు. మృతురాలిని గతంలో కూడా భర్త చిత్రహింసలకు గురి చేసేవాడిని మృతురాలి బంధువులు తెలిపారు.