వికారాబాద్, వెలుగు: కూలి పనికి వెళ్ళిన మహిళ రైలు పట్టాల పక్కన శవమై కనిపించిన ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. ధారూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ (38) కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులు వ్యవసాయం చేసుకుంటూ, లేనప్పుడు అడ్డా కూలీలుగా పనికెళ్తారు. గురువారం ఉదయం ఆమె ఇంటి నుంచి పనికోసం వికారాబాద్ వచ్చింది. సాయంత్రమైనా తిరిగి వెళ్లకపోవడంతో కుటుంబసభ్యులు బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు.
దీంతో శుక్రవారం ఉదయం పోలీసులకు కంప్లయింట్చేయగా మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. వికారాబాద్ పరిధి ఆలంపల్లి నుంచి గెర్గిట్పల్లి వెళ్లే రోడ్డులో రైలు పట్టాల పక్కన మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి క్లూస్ టీమ్ తో తనిఖీ చేయించారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు ఫైల్ చేసినట్టు సీఐ రాజశేఖర్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సంజీవరావు పరిశీలించారు.