నల్లగొండ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. ఆ విషయం తెలుసుకున్న ఆమె ప్రేమించిన వాడు పెళ్లయిన కాసేపటికి అక్కడి వచ్చాడు. అతడిని చూసిన ఆ యువతి.. వెంటనే భావోద్వేగానికి లోనై అతన్ని గట్టిగా పట్టుకుని ఏడ్వడంతో, ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ విషయమై పెద్దమనుషుల్లో పంచాయితీ పెట్టాడు. దీంతో ఆ యువతి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది.
నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన మౌనిక తనకు వరుసకు మామయ్య అయ్యే రాజేశ్తో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు మౌనికకు దేవరకొండకు చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పే ధైర్యం లేని మౌనిక ఆ యువకుడితో పెళ్లికి అంగీకరించింది. వివాహమూ చేసుకుంది. పెళ్లయిన కాసేపటికి అక్కడికి ఆమె ప్రేమించిన వ్యక్తి రాజేశ్ వచ్చాడు. అతడిని చూసిన మౌనిక.. వెంటనే అతడిని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఫలితంగా మౌనికను వివాహమాడిన యువకుడు పెద్దల ముందు పంచాయతీ పెట్టాడు.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పలు చర్చల తర్వాత తాము ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నామని మగ పెళ్లివారు తేల్చి చెప్పారు. దాంతో ఈనెల 13న రాజేశ్, మౌనికలు మళ్లీ వివాహం చేసుకున్నారు. ముందుగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న మౌనిక .. మర్నాడు తాను మనసిచ్చిన యువకుడిని మనువాడింది.