
ఐపీఎల్ ఫైనల్లో ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో స్టార్ క్రికెటర్లకు బాగా తెలుసు. ఎందుకంటే టోర్నీ మొత్తం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినా ఫైనల్లో దురదృష్టవశాత్తు తమ జట్టు ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురవవుతారు. ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ ఉన్నాడని అందరికీ తెలుసు. కోహ్లీ మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టైటిల్ అందించలేక పోయాడు. 2009,2011,2016 లలో ఆర్సీబీ ఫైనల్ కు చేరుకున్నా ట్రోఫీ అందుకోలేకపోయింది.
కోహ్లీ కాకుండా మరో స్టార్ ప్లేయర్ కూడా ఉన్నాడు. అతడే ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్. చాహల్ ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు. బెంగళూరు జట్టు తరపున ఏడు సీజన్ ల పాటు ఆడాడు. ఈ క్రమంలో 2016 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు వచ్చింది. ఈ ఫైనల్లో సన్ రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. ఆ తర్వాత చాహల్ బెంగళూరు ముంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్ళాడు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడింది. రెండు సార్లు చాహల్ తన జట్టుకు అత్యుత్తమ బౌలర్ గా రాణించినా టైటిల్ అందుకోలేకపోయాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 2025 లో చాహల్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్ కు అర్హత సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం (జూన్ 3) మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ సారైనా చాహల్ ఐపీఎల్ టైటిల్ కొడతాడో లేదో చూడాలి. చాహల్ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే 173 మ్యాచ్ ల్లో 220 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్ లో 13 మ్యాచ్ లాడిన ఈ లెగ్ స్పిన్నర్ 15 వికెట్లు పడగొట్టాడు.