సామాన్యుల భూములపై లీడర్ల కన్ను

సామాన్యుల భూములపై లీడర్ల కన్ను

 

  •     220 మందిని ఖాళీ చేయించే యత్నం  
  •     మాజీ మార్కెట్ చైర్మన్ పై పోలీసులకు కంప్లైంట్

ఆదిలాబాద్‍, వెలుగు: 20 ఏళ్ల క్రితం కొనుకున్న స్థలాలకు అప్పుడే రిజిస్ట్రేషన్ అయినప్పటికీ అధికార పార్టీ లీడర్లు వచ్చి వెంటనే ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ మెట్టు ప్రహ్లాద్ తన అనుచరులతో వెళ్లి ట్రాక్టర్లతో దున్నించడం గొడవకు దారి తీసింది. ఈ విషయంపై ఆదిలాబాద్‍ రూరల్ పోలీస్​ స్టేషన్​లో బాధితులు కంప్లైంట్​చేశారు. ఆదిలాబాద్‍  పట్టణ శివారులోని అంకోలి రోడ్​లో 68 సర్వే నెంబర్​లోని స్థలంలో 20 ఏళ్ల క్రితం 220 ప్లాట్లను కొందరు  కొనుగోలు చేశారు. స్థల యజమాని తన వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్​ చేసి ప్లాట్లుగా విక్రయించాడు. అలా కొనుగోలు చేసిన వారు  అక్కడ కొన్ని ఇండ్లుకూడా కట్టుకున్నారు. తాజాగా ఆ స్థలం తమదంటూ ఓ వ్యక్తి టీఆర్ఎస్ నేతలను వెంట తీసుకొని రావడం గొడవలకు దారి తీస్తోంది. నాలుగు రోజుల క్రితం ఉదయం 10 గంటలకు ట్రాక్టర్లతో వచ్చిన టీఆర్ఎస్  నేతలు అక్కడి ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించారు. విషయం తెలుసుకున్న స్థల యజమానులు అక్కడిని చేరుకొని మాజీ మార్కెట్​చైర్మన్​మెట్టు ప్రహ్లాద్​ను నిలదీశారు.

68 సర్వే నంబర్​లో భూమి వివాదంలో ఉందంటూ ఓ వ్యక్తి తనను పిలవడంతోనే వచ్చానని ఆయన బాధితులతో పేర్కొన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుగోలు చేసుకున్న ప్లాట్లను ట్రాక్టర్లతో దున్నడం ఏమిటని నిలదీశారు. ఈ నేపథ్యంలో గొడవ పెరిగింది. విషయాన్ని బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు.  68 సర్వే నెంబర్​లోని వ్యవసాయ భూములన్నీ 20 ఏళ్ల క్రితం ప్లాట్లుగా మార్చారు. 20 ఏళ్లు గడిచిన తర్వాత ఆ భూములు తమవే అంటూ సామాన్యులపైకీ అధికార పార్టీ నేతలు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వారు నిజమైన పట్టదారులైతే 20 ఏళ్లు ఏం చేశారనే ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని రెవెన్యూ ఆఫీసర్లు చూసుకుంటారని ఆదిలాబాద్ రూరల్ సీఐ పురుషోత్తంచారి తెలిపారు. స్థల వివాదంలో ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని
 తెలిపారు.