బెంగళూరులో అద్దెలు తగ్గిస్తున్న ఓనర్స్.. టెక్కీలు చేస్తున్న ఆ పనితో..

బెంగళూరులో అద్దెలు తగ్గిస్తున్న ఓనర్స్.. టెక్కీలు చేస్తున్న ఆ పనితో..

ప్రస్తుతం నడుస్తోంది టెక్ ప్రపంచం. అయితే దీనిని వెనుక నుంచి నడిపించేది ఐటీ నిపుణులు, అనేక టెక్ కంపెనీలు. భారతదేశంలో ఐటీ రంగానికి పెట్టింది పేరు బెంగళూరు. ప్రస్తుతం టెక్ రంగం దాదాపు అన్ని రాష్ట్రాల్లోని నగరాలకు విస్తరించినప్పటికీ.. ప్రధానంగా బెంగళూరులో ఇది కేంద్రీకృతం అయ్యింది. అందుకే అక్కడ ఇంటి అద్దెలు కూడా ఊహించని స్థాయిల్లో చెబుతుంటారు ఓనర్స్. సంపాదించినదానిలో దాదాపు సగం అద్దెకు ఖర్చు కావటం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారిని నిరుత్సాహ పరుస్తోంది. 

ప్రస్తుతం కనీసం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లటానికి ట్రాఫిక్ లో రెండు మూడు గంటలు పట్టడం.. అధిక అద్దెలు, పొల్యూషన్, ప్రయాణ కష్టాలు, భాషా పరమైన ఇబ్బందులు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సమస్యలు బెంగళూరుకు వస్తున్న ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పైగా ఫ్రెషర్లు కూడా తమ చదువు తర్వాత ఉద్యోగాల కోసం బెంగళూరుకు రావటం తగ్గించటంతో నగరంలో పీజీ హాస్టల్స్, ఇళ్లకు డిమాండ్ తగ్గుతోంది. 

గతంలో దాదాపు లక్ష నుంచి రెండు లక్షలు డిపాజిట్ తీసుకునే యజమానులు చివర్లో పెయింటింగ్, అది ఇది అంటూ సగం వరకు నొక్కేసేవారు. ఇప్పటికీ ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయనుకోండి. దీనికి తోడు ఏటా 20 శాతం వరకు అద్దెల పెంపుతో అసలు సంపాదిస్తోంది వారి కోసమా లేక బెంగళూరులో ఇంటి యజమానుల కోసమా అనే అనుమానం చాలా మందికి కలుగుతోంది. దీనికి తోడు కరోనా సమయంలో నిర్మాణాలు ఆగటం ప్రాజెక్టులు, డెలివరీలను ఆలస్యం చేసింది. కానీ ప్రస్తుతం ఇవి ఊపందుకోవటంతో చాలా మంది వేలకు వేలు అద్దె కట్టడం కంటే అపార్ట్మెంట్ కొనుక్కుని దానికి ఈఎంఐ చెల్లించటం మంచిదని భావిస్తున్నారు. 

దీంతో చాలా మంది బెంగళూరులో నగరం నడిబొడ్డు నుంచి ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా వారి సొంత నగరాలకు దగ్గరలో ఆఫీసులకు తిరిగి మైగ్రేట్ అయిపోవటంతో అద్దె ఇళ్లకు డిమాండ్ తగ్గటం స్టార్ట్ అయ్యింది. చేసేది లేక ఇంటి ఓనర్లు సైతం గతంలో మాదిరిగా రుబాబు చూపించకుండా ఇంటి అద్దెలను తగ్గిస్తున్నారని రెడిట్ వేధికగా కొందరు చెబుతున్నారు. 

అలాగే అద్దెలు ఇల్లు తీసుకునే ముందు యజమానులతో మాట్లాడటం ద్వారా 15 శాతం వరకు రెంట్ తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుందని రెడిట్ యూజర్ చెప్పారు. చాలా మంది అధిక అద్దెలు కట్టలేక తమ యజమానులను రెంట్స్ తగ్గించాలని కోరుతున్నారని వెల్లడించారు. అనేక చోట్ల ఇళ్లు  టూలెట్స్ పెడుతుంటే ఎంక్వైరీలు కూడా తక్కువగా వస్తున్నాయని, అధిక అద్దెలకు ఉండేందుకు బెంగళూరులో ఎవ్వరూ ఇష్టపడటం లేదని వెల్లడైంది. ఇది చూస్తుంటే వాస్తవ పరిస్థితులను ఇంటి యజమానులు కూడా అర్థం చేసుకుంటున్నారనిపిస్తోంది.