
- 2026 మార్చిలోగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్
- 18 ఎకరాల విస్తీర్ణంలో 88 రిసార్టులు
- టూరిస్టుల రక్షణ కోసం 7.75 కిలోమీటర్లు చుట్టూ ఫెన్సింగ్
- ‘స్వదేశ్ దర్శన్’ కింద ఎకోటూరిజం అభివృద్ధికి రూ.38 కోట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వికారాబాద్ జిల్లాను ప్రకృతి రమణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనుంది. ఇందులో భాగంగా అనంతగిరిలో గ్లాంపింగ్స్ (ప్లాట్ ఫారాలు) ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి వీటిని నిర్మించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. 18 ఎకరాల విస్తీర్ణంలో 88 గ్లాంపింగ్ యూనిట్లను (టెంట్తో కూడిన లగ్జరీ వసతి గృహాలు) ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్లాంపింగ్ ను సుమారు రూ.4.31 లక్షలతో నిర్మించనున్నారు.
ఇందు కోసం ఇప్పటికే రూ.38 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో ఎకరంలో సుమారు 5 రిస్టార్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు టూరిజం శాఖ నుంచి అనుమతులు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, పంట పొలాలతో పర్యాటకులకు అనంతగిరి మరిచిపోలేని అనుభూతిని అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ‘తెలంగాణ ఊటీ’గా ప్రమోట్ చేస్తూ ఎకోటూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. వీకెండ్స్లో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సకల సౌకర్యాలతో 88 గ్లాంపింగ్ యూనిట్లను నిర్మించనున్నారు. ఒక్కో యూనిట్ లో సింగిల్ బెడ్రూం, అటాచ్డ్ బాత్రూమ్, కిచెన్, సోఫా, మూడు కుర్చీలు, అందులో స్పెషల్ ఎట్రాక్షన్ గా లాంథర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రకృతి ఒడిలో ఒదిగిపోయేలా, టూరిస్టులను ఆకర్షించేలా వీటిని నిర్మించనున్నారు. గ్లాంపింగ్స్ బుకింగ్, అద్దెపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. కాగా.. అనంతగిరిలో టూరిజం శాఖకు 213 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 50.50 ఎకరాల్లో ‘స్వదేశ్ దర్శన్’ కింద ఎకోటూరిజం అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తున్నది.
7.75 కిలో మీటర్లు ఫెన్సింగ్
అనంతగిరిలో పర్యాటకుల భద్రత కోసం 7.75 కిలోమీటర్ల పొడవునా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అడవి జంతువుల నుంచి రక్షణతో పాటు పర్యాటకులకు ఆహ్లాదం అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అంతేకాకుండా సాహస ప్రియుల కోసం 4.9 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ని ర్మించనున్నారు. అలాగే రెస్టారెంట్లు, రిసెన్షన్, ఇంటర్నల్ పాత్ వేలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆరు వ్యూ పాయింట్లు కట్టనున్నారు.
ఈ వ్యూ పాయింట్ల దగ్గర ఫుడ్ కియోస్క్ నిర్మించనున్నారు. లోయలు, అడవులు, కొండలు, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా అనంతగిరి హిల్స్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో ఒక లగ్జరీ వెల్నెస్ రిసార్టును ఏర్పాటు చేసే యోచనలో ఉంది. బెంగళూరులోని జిందాల్ నేచురల్ క్యూర్ తరహాలో దీనిని నిర్మించాలని టూరిజం శాఖకు సూచించినట్లు తెలిసింది.
పర్యాటక హబ్గా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో అనేక పర్యాటక, చారిత్రాక పాంత్రాలు ఉన్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదించేలా అనంతగిరిలో గ్లాంపింగ్లను ఏర్పాటు చేస్తున్నాం. 18 ఎకరాల్లో 88 ప్లాట్ ఫారాలు నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తాం.- మంత్రి జూపల్లి కృష్ణారావు