ఆషాఢ బోనాలు ఘనంగా నిర్వహించాలి : మంత్రులు కొండా సురేఖ, పొన్నం

ఆషాఢ బోనాలు ఘనంగా నిర్వహించాలి : మంత్రులు కొండా సురేఖ, పొన్నం
  • భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు: మంత్రులు కొండా సురేఖ, పొన్నం
  • ఈ నెల 26న గోల్కొండలో తొలి బోనం సమర్పణ
  • ఇప్పటికే ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది
  • అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి 
  • ఆషాఢ బోనాలపై అధికారులతో రివ్యూ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో ఆషాఢ బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించాలని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. భక్తులకు, శివసత్తులు, జోగినీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బోనాల పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. 

మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని ఎంసీహెచ్‌‌‌‌ఆర్డీలో ఆషాఢ మాస బోనాలు ఉత్సవాలపై అన్ని శాఖల అధికారులతో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బోనాల జాతరను సక్సెస్‌‌‌‌ చేయాలని సూచించారు. వీఐపీ పాస్‌‌‌‌ల విషయంలో గందరగోళం తలెత్తకుండా చూడాలని చెప్పారు. మంచి నీరు, అంబులెన్స్‌‌‌‌లు, మెడికల్ స్టాల్స్, మొబైల్ టాయిలెట్స్, శానిటేషన్‌‌‌‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అధికారులు భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. 

బోనాలపై విస్తృత ప్రచారం: మంత్రి పొన్నం 

బోనాల పండుగ సమయంలో గతేడాది జరిగిన పొరపాటు ఈ ఏడాది జరగకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్ కా షాన్ బోనాలపై విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26న గోల్కొండ జగదాంబిక అమ్మవారి తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. గోల్కొండ జాతర, బల్కంపేట ఎల్లమ్మ తల్లి వార్షిక కల్యాణోత్సవం, లష్కర్, లాల్ దర్వాజ బోనాలు, అమ్మవారి అంబారి ఊరేగింపు, రంగం కార్యక్రమాలు అన్ని సక్రమంగా జరిగేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. నూతన దేవాలయాలు యాడ్ అయ్యాయని, ఇంకో 10 శాతం నిధులు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

ఉత్సవాలను ఒక డ్యూటీలా కాకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆజ్ఞతో సేవ చేస్తున్నామని భావించాలన్నారు. బోనాల కోసం వివిధ జిల్లా నుంచి వచ్చే ప్యాసింజర్స్ కోసం బస్టాప్స్, రైల్వే స్టేషన్‌‌‌‌లో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సిటీలో వివిధ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ జితేందర్, ఎండోమెంట్ డైరెక్టర్ వెంకట రావు, సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

అంబారీ విషయంలో ఈసారి ఇష్యూ కాకుండా చూసుకోవాలి..

అమ్మవారి ఊరేగింపు కోసం తీసుకొచ్చే ఏనుగు విషయంలో జీవో, పర్మిషన్స్ వల్ల ఏటా ఏదో ఒక సమస్య వస్తున్నది. ఎవరో ఒకరు కంప్లైంట్ చేయడం, పోలీస్ డిపార్ట్‌‌‌‌మెంట్ పోయి కోర్టు ముందు నిల్చోవాల్సి వస్తుంది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. జాతర బందోబస్తు డ్యూటీలో ఉండే అధికారులు డ్యూటీ టైం కంటే కొంచెం ముందుగా రావాలి. జాతరలో క్రైం పెరుగుతుంది. 

దొంగతనాలు, పిక్ పాకెటింగ్, ఆకతాయిల అల్లర్లు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి మఫ్టీలో పోలీసు సిబ్బంది ఉంటారు. షీ టీమ్స్ కూడా ఉంటాయి. దేవాదాయ శాఖ ఆలయాల తరఫున వలంటీర్లను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బోనాల సమయంలో డీజేలకు పర్మిషన్ లేదు.. కానీ, బ్యాండ్‌‌‌‌లు పెట్టుకోవచ్చు. 
- సీవీ ఆనంద్, హైదరాబాద్‌‌‌‌ సిటీ పోలీస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌