బీసీ బిడ్డ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ ఓరుస్తలేదు: కాంగ్రెస్ నాయకులు

బీసీ బిడ్డ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ ఓరుస్తలేదు: కాంగ్రెస్ నాయకులు

యాదగిరిగుట్ట, వెలుగు : బీసీ బిడ్డ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే కావడంతో బీఆర్ఎస్ నాయకులు ఓరుస్తలేరని యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, యాదగిరిగుట్ట మాజీ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ గౌడ్ మండిపడ్డారు. యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజల అండదండలతో ఓ బీసీ వ్యక్తి ఎమ్మెల్యే అయితే అగ్రవర్ణ నాయకుల నుంచి ఎన్ని రకాల ఇబ్బందులు, రాజకీయ దాడులు ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పుడిప్పుడే తమకు అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

బీసీ బిడ్డ రాజకీయంగా ఎదగకూడదా.? అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇంట్లో పని మనిషి సూసైడ్ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వక నిరాధారమైన ఆరోపణలు చేసి ఎమ్మెల్యే వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్నారు. ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని ఎమ్మెల్యేకు ఆపాదిస్తూ బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు. 

మెడికల్ కాలేజ్ పై బీఆర్ఎస్ అనవసర అలజడి సృష్టిస్తోంది..

రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజ్ విషయంలో బీఆర్ఎస్ అనవసర అలజడి సృష్టిస్తోందని కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం మల్లాపురంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్లేస్ అనుకూలంగా లేకపోవడంతో.. యాదగిరిగుట్టలోని టెంపుల్ సిటీలో కాలేజ్ నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయాన్ని కూడా బీఆర్ఎస్ స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు తమ వైఖరి మార్చుకోవలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ మండల నాయకుడు హేమేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మదర్ డెయిరీ డైరెక్టర్ శ్రీశైలం, యాదగిరిగుట్ట ఆలయ మాజీ ధర్మకర్త శ్రీధర్ గౌడ్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.