ఫోన్ పంపి 77 లక్షలు కొట్టేశారు .. ఈ– సిమ్ మార్పిడి పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం

 ఫోన్ పంపి 77 లక్షలు కొట్టేశారు .. ఈ– సిమ్ మార్పిడి పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం
  • ఫోన్​లో సిమ్ వేయగానే అకౌంట్ ఖాళీ
  • హైదరాబాద్​కు చెందిన బాధితుడి ఫిర్యాదుతో నలుగురు అరెస్ట్

ఈ-సిమ్ ను ఫిజికల్ ​సిమ్​గా​ మార్చు కోవాలని చెప్పి హైదరాబాద్​కు చెందిన ఓ వ్యాపారి నుంచి సైబర్  కేటుగాళ్లు రూ.77.55 లక్షలు కొట్టేశారు. ఈ కేసులో పోలీసులు బెంగాల్, రాజస్తాన్​కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.15 లక్షల నగదు, ల్యాప్​టాప్, మొబైల్  ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


గచ్చిబౌలి, వెలుగు: ఈ–సిమ్ ను ఫిజికల్​సిమ్​గా​మార్చుకోవాలని చెప్పి, హైదరాబాద్​కు చెందిన ఓ వ్యాపారి నుంచి సైబర్  కేటుగాళ్లు రూ. 77.55 లక్షలు కొట్టేశారు. ఈ కేసులో బెంగాల్, రాజస్థాన్ కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల నగదు, ల్యాప్​టాప్, మొబైల్  ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్  కమిషనరేట్​ సైబర్  క్రైం డీసీపీ సాయి మనోహర్ శనివారం వెల్లడించారు. 

బెంగాల్​కు చెందిన సలీం మండల్  అనే నిందితుడు తొలుత హైదరాబాద్​కు చెందిన వ్యాపారి విజయ్​కుమార్​కు ఫోన్ చేసి, తాను ‘సిటీ బ్యాంక్  క్రెడిట్  కార్డు విభాగం’ అధికారిని అని పరిచయం చేసుకున్నాడు. టెలికాం శాఖ వెరిఫికేషన్  ఉందనే నెపంతో విజయ్​కుమార్  వాడుతున్న ఈ-–సిమ్ ను సాధారణ ఫిజికల్  సిమ్​ కార్డుగా మార్చుకోవాలని కోరాడు. అందుకు విజయ్​కుమార్  ఒప్పుకోగా, సిమ్  మార్చుకోవడానికి బ్యాంకు తరపున తామే ఒక ప్రత్యేక మొబైల్  ఫోన్  పంపిస్తామని, అందులోనే సిమ్  కార్డ్  వేసుకోవాలని నిందితుడు సూచించాడు. చెప్పినట్లుగానే మోటరోలా స్టిక్కర్లు, బ్యాంకు లేబుల్స్  వేసి ఉన్న ఒక మొబైల్ ఫోన్​ను కొరియర్ ద్వారా విజయ్​కుమార్​కు పంపించాడు. 

అయితే, ఆ ఫోన్​లో ముందే ఒక మాల్వేర్​ను నిందితులు ఇన్​స్టాల్ చేసి ఉంచారు. విజయ్​కుమార్  కొరియర్ ఓపెన్ చేసి, ఆ ఫోన్​లో తన సిమ్  కార్డు వేయగానే లోపల ఉన్న మాల్వేర్  యాక్టివేట్  అయ్యింది. ఆయన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఓటీపీలు, ఇతర బ్యాంకింగ్  మెసేజీలు అన్నీ బాధితుడికి తెలియకుండానే నేరుగా నిందితుడి ఫోన్​కు డైవర్ట్  అయిపోయాయి. ఓటీపీలు తమ చేతికి చిక్కడంతో నిందితులు విజయ్​కుమార్  అకౌంట్ల నుంచి రూ.77.75 లక్షలు కొల్లగొట్టారు. తన ఖాతా నుంచి డబ్బు మాయం కావడంతో బాధితుడు విజయ్​కుమార్..  సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు.. డబ్బు బదిలీ అయిన ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తూ వెస్ట్ బెంగాల్​కు వెళ్లారు. దాదాపు నెల రోజుల పాటు కోల్​కతాలోనే ఉండి నిఘా పెట్టి, ప్రధాన నిందితుడు సలీం మండల్​తో పాటు అబ్దుల్  అలీం, సయ్యద్  హమీమ్  రెజా, బన్సిధర్ ను అరెస్టు చేశారు. వారిని ట్రాన్సిట్  వారంట్​పై హైదరాబాద్  తీసుకువచ్చి రిమాండ్​కు తరలించారు.