- ఇండిఫైతో జత రూ. 5 లక్షల నుంచి
- రూ.50 లక్షల దాకా అప్పు
న్యూఢిల్లీ: దేశంలోని చిన్న వ్యాపారాలకు అప్పులు ఇవ్వనున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. రూ.5 లక్షల నుంచి రూ. 50 లక్షల దాకా అప్పులను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇలా అప్పులిచ్చేందుకు ఇండిఫై సహా పలు ఫైనాన్స్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. తన ప్లాట్ఫామ్పై అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే చిన్న వ్యాపారాలకు ఈ అప్పులు ఇస్తామని ఫేస్బుక్ తెలిపింది. ఫేస్బుక్ ఈ ప్రోగ్రామ్ను మొదటగా ఇండియాలోనే అమలు చేస్తోంది. దేశంలోని 200 సిటీలలో రిజిస్ట్రేషన్ ఉన్న బిజినెస్లు అన్నింటికీ ఈ ప్రోగ్రామ్ వర్తిస్తుందని ఫేస్బుక్ పేర్కొంది. చిన్న వ్యాపారులకు అవసరమైన బిజినెస్లోన్లు మరింత తొందరగా వచ్చేలా చూడాలనేదే తమ లక్ష్యమని ఫేస్బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ అజిత్ మోహన్ వెల్లడించారు. ఈ ప్రోగ్రామ్లో ఫేస్బుక్కు ఎలాంటి రెవెన్యూ షేర్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ఫేస్బుక్ప్లాట్ఫామ్పైనే ఈ డబ్బు ఖర్చు చేయాలనే రూలేమీ లేదని కూడా పేర్కొన్నారు. అప్రూవల్, డిస్బర్స్మెంట్, రికవరీ వంటి అన్నింటినీ ఇండిఫై కంపెనీనే చూసుకుంటుందన్నారు. 200 మిలియన్ల బిజినెస్లు గ్లోబల్గా ఫేస్బుక్ యాప్స్ (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్)ను ఉపయోగించుకుంటున్నాయని, ఇండియాలోనూ చాలా బిజినెస్లు వాడుకుంటున్నాయని అజిత్ మోహన్ వివరించారు. ఫేస్బుక్ ప్లాట్ఫామ్పై అడ్వర్టయిజ్ చేసే బిజినెస్లు ఇండిఫై నుంచి 17–20 శాతం వడ్డీ రేటుతో అప్పులు తీసుకోవచ్చు. వీటికి ప్రాసెసింగ్ ఫీజు ఉండదని పేర్కొన్నారు. డాక్యుమెంటేషన్ పూర్తయిన అయిదు రోజులలోపే అప్పు మొత్తాన్ని ఇండిఫై డిస్బర్స్ చేస్తుందని చెప్పారు. మహిళలకైతే 0.2 శాతం వడ్డీ తగ్గింపు ఉంటుందన్నారు. 2020లో నిర్వహించిన తమ సర్వేలో క్యాష్ ఫ్లో మెయిన్ ఛాలెంజని చాలా బిజినెస్లు చెప్పినట్లు ఫేస్బుక్ వెల్లడించింది. ఎక్కువ క్రెడిట్ హిస్టరీ లేని చిన్న వ్యాపారాలకు అప్పులు దొరకడం అంత ఈజీ కాకపోవడంతో, ఈ ప్రోగ్రామ్ను తెస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. ఈ దిశలో ఫేస్బుక్తో కలిసి పనిచేయనున్నట్లు లాంచ్ సందర్భంగా ఫిక్కి ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ కూడా చెప్పారు.100 మిలియన్ డాలర్ల గ్లోబల్ గ్రాంట్లో భాగంగా ఇండియా కోసం 4 మిలియన్ డాలర్లు వెచ్చించామని, 3 వేల చిన్న వ్యాపారాలు ఈ బెనిఫిట్ పొందాయని మోహన్ వివరించారు.