
- ఒకరు మృతి.. 35 మందికి అస్వస్థత
- హాస్పిటల్ను విజిట్ చేసిన కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 35 మంది అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హాస్పిటల్లో ఉన్న మానసిక రోగులకు సోమవారం స్పెషల్ ఫుడ్ పెట్టారు. మరుసటి రోజు మంగళవారం తెల్లవారుజాము నుంచి పేషెంట్లకు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఓ పేషెంట్ స్పృహ తప్పి పడిపోవడంతో పరీక్షించిన డాక్టర్లు.. అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
అయితే, ఆ పేషెంట్ కార్డియాక్ అరెస్ట్తో చనిపోయాడని, ఫుడ్ పాయిజన్తో కాదని హాస్పిటల్ సూపరింటెండెంట్ అనిత తెలిపారు. అతనికి ఎలాంటి విరేచనాలు, కడుపునొప్పి లక్షణాలు లేవని, గతం నుంచే జులుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడని, దీంతోనే అతను న్యుమోనియా బారినపడి కార్డియాక్ అరెస్ట్కు గురై ఉండొచ్చన్నారు. డెడ్బాడీని పోస్ట్మార్టానికి పంపించామని, రిపోర్ట్ వచ్చాక మృతికి కారణం తెలుస్తుందని చెప్పారు. మృతుడు 2023లో హాస్పిటల్లో చేరాడని, కొద్ది రోజులకే అతని మానసిక పరిస్థితి మెరుగుపడినా... కుటుంబసభ్యులు ఎవరూ లేకపోవడంతో హాస్పిటల్లోనే ఉంటున్నాడని అధికారులు వెల్లడించారు. అస్వస్థతకు గురైన వారికి హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నారు.
టెస్టులకు ఆహార, తాగునీటి శాంపిల్స్
ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ మంగళవారం సాయంత్రం హాస్పిటల్ను సందర్శించారు. ఈ ఘటన గురించి, పేషెంట్ల ఆరోగ్యం గురించి హాస్పిటల్ సూపరిండెంటెంట్ అనిత, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పేషెంట్ల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఫుడ్, వాటర్ శాంపిల్స్ను టెస్టులకు పంపించామన్నారు. పేషెంట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.