
- ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఊరట
హైదరాబాద్, వెలుగు: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ.. సీబీఐ కోర్టు విధించిన శిక్షను నిలుపుదల చేసింది. గాలి జనార్ధన్ రెడ్డితో పాటు ఈ కేసులో దోషులైన బీవీ శ్రీనివాస రెడ్డి, వీడీ.రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్కూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల వ్యక్తిగత బాండ్తో పాటు మరో రెండు పూచీకత్తులు సమర్పించాలంటూ బీవీ.శ్రీనివాస రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్కు ఆదేశించింది. పూచీకత్తు మొత్తం తగ్గించాలంటూ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ కోరడంతో.. రూ.లక్ష వ్యక్తిగత బాండ్తో పాటు అంతే మొత్తానికి రెండు పూచీకత్తులు సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశించింది.
కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఎలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడరాదని షరతు విధించింది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్రెడ్డి, బీవీ.శ్రీనివాస రెడ్డి, మెఫజ్ అలీఖాన్, వీడీ.రాజగోపాల్కు ఏడేండ్ల శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పు అమలును కూడా నిలిపివేసింది. దోషులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విచారించిన జస్టిస్ కే.లక్ష్మణ్.. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
గాలి జనార్దన్ రెడ్డి శిక్ష అమలును నిలిపివేయని పక్షంలో ఇప్పటికే అనర్హత వేటు పడినందున.. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నిక జరిగితే ప్రజాప్రతినిధిగా ఎంపికైన గాలి తన నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించలేరని జడ్జి పేర్కొన్నారు.
శ్రీలక్ష్మి కేసులో కౌంటర్ దాఖలు చేయండి
ఓఎంసీ కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్లో వారంలోగా కౌంటరు దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.