చెన్నైతో పాటు తమిళనాడులోని పది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్(IMD) బుధవారం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని చెప్పింది. ఇది పశ్చిమవాయువ్య దిశగా పయనించి, గురువారంఉదయం తమిళనాడు ఉత్తర తీరాన్ని తాకనుందని.. దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కారైకాల్లలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు.
IMD హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజావరదలు, ఇతర అత్యవసర పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేసేందుకు, మొబైల్ సేవలకు అంతరాయంకలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం 434 'సైరన్ టవర్స్'ను ఏర్పాటు చేసింది. సహాయక చర్యల కోసం 46 బోట్లు,జేసీబీలతో పాటు వరద నీటినితోడించేందుకు 500కు పైగా అతి పెద్ద మోటార్ పంప్లను సిద్ధం చేసింది.
ఈ వారం ప్రారంభంలో కురిసిన వర్షాలకు సుమారు 400 ప్రాంతాల్లోని 216 ప్రాంతాలనుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు.అమ్మ క్యాంటిన్ల నుండి ఉచిత భోజనాన్ని అందించనున్నట్లు చెప్పారు. భారీ వర్షాల హెచ్చరికతో ఇవాళ(బుధ), గురువారాల్లో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్పట్టు, కడలూర్, నాగపట్టణం, తంజావూర్, తిరువారూర్ జిల్లాల్లో స్కూళ్లు,కాలేజీలకు సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.