పేదోడి సొంతింటి కల సాకారం చేస్తున్నాం : శోభారాణి

పేదోడి సొంతింటి కల సాకారం చేస్తున్నాం : శోభారాణి
  • స్టేట్ విమెన్ కో–ఆపరేటివ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభారాణి 

యాదగిరిగుట్ట, వెలుగు : పేదోడి సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ విమెన్ కో–ఆపరేటివ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం రామాజీపేటలో కోల మాధవి, మల్లేశ్ గౌడ్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇల్లు లేని ప్రతి పేద బిడ్డకు పక్కా ఇల్లు కట్టించడం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.

సొంత ఇల్లు లేని పేదోళ్లు ఉండొద్దనేదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఏడాది ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. ఐదేళ్లలో ప్రతి పేదోడికి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చి సొంతింటి కల సాకారం చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని సూచించారు.

అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమపాళ్లలో అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజుగౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.