
- ప్రెస్మీట్లలో నో కాంట్రవర్సీ
- ఇంటి గుట్టంతా ఆఫ్ ద రికార్డ్లోనే బయటకు..
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీరు.. ఇటు పార్టీ వర్గాలతోపాటు ఆమె అనుచరుల్లో అయోమయానికి దారి తీస్తున్నది. మీడియా చిట్చాట్లలో ఇంటి గుట్టంతా బయటపెట్టేస్తున్న ఆమె.. ప్రెస్మీట్లలో మాత్రం పార్టీనిగానీ, నేతలనుగానీ పల్లెత్తు మాట అనడం లేదు. ‘ఆఫ్ ద రికార్డ్’ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కవిత.. మీడియా ముందు నేరుగా మాట్లాడేటప్పుడు కాంట్రవర్సీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఎవరికీ చిక్కకుండా.. దొరక్కుండా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. చిట్చాట్లలో లీకులిచ్చే బదులు.. నేరుగా మాట్లాడొచ్చు కదా? అని పలువురు నేతలు రెచ్చగొడ్తున్నా.. కవిత మాత్రం ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు.
ఇప్పటికి 3 సార్లు చిట్చాట్లలోనే కేటీఆర్, హరీశ్రావులాంటి వారిని టార్గెట్చేసిన ఆమె.. మీడియా ముందు మాత్రం జాగృతి గురించి, ఉద్యమ కార్యాచరణ గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా జాగృతి కొత్త ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె పార్టీ పైగానీ.. ముఖ్య నేతలపైగానీ ఎలాంటి సంచలన కామెంట్స్ చేయలేదు. కేవలం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపైనే మాట్లాడారు. ఇటు ప్రభుత్వాన్నీ, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని విమర్శలు చేశారు.
అమెరికాకు వెళ్లే ముందూ చిట్ చాటే..
అమెరికాకు వెళ్లడానికి ముందు కూడా మీడియాతో చిట్చాట్ చేసిన కవిత.. ఇన్డైరెక్ట్గా తన ఇంటి వాళ్లపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. ‘‘ఇన్నాళ్లూ జైలులో ఉండొచ్చింది సరిపోదా? ఇంకా నన్ను రెచ్చగొడతారా’’ అంటూ మీడియాకు లీకులిచ్చారు. తనను ఎంత రెచ్చగొడితే అంతలా రియాక్ట్ అవుతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పుడు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
అమెరికా నుంచి వచ్చాక ఎయిర్పోర్టులో ‘కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత.. ఆ తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన అంశాన్ని మాత్రం మీడియా చిట్చాట్లో ‘ఆఫ్ ద రికార్డ్’గా బయటపెట్టారు. ఆ తర్వాత మంచిర్యాల టూర్లోనూ మీడియాతో చిట్చాట్చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి జరిగిన కుట్రపైనే మరోసారి మాట్లాడారు. చిట్చాట్లో అయితే రికార్డ్ ఉండదు కాబట్టి.. ఏం మాట్లాడినా ఏం కాదని భావించే ఆఫ్ ద రికార్డ్గా కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.