
ప్రతి ఏడాది శబరిమల యాత్రను వైభవంగా నిర్వహిస్తుంది కేరళ్ ప్రభుత్వం. లక్షలాది మంది భక్తులు శబరిమల వెళ్తుంటారు. అయితే కరోనా కారణంగా గతేడాది ఈ యాత్రను పరిమిత సంఖ్యకే పరిమితం చేసింది. ఈ ఏడాది నవంబర్ 16 నుంచి తిరిగి శబరిమల యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
రోజుకు 25 వేల మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రెండు టీకాలు వేయించుకున్నవారు లేదంటే RTPCR టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన భక్తులకు మాత్రమే ఆలయంలోకి అనుమతించాలని నిర్ణయించింది. దర్శనం తర్వాత సన్నిధానంలో ఎవరూ ఉండకుండా తిరిగి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేపట్టారు. గతేడాది తరహాలోనే యాత్రికులను ఎరుమేలి మీదుగా అటవీ మార్గంలో పులిమేడు మీదుగా సన్నిధానానికి అనుమతించకూడదని సర్కార్ నిర్ణయం తీసుకుంది. నీలక్కల్ నుంచి భక్తులు కేరళ ప్రభుత్వ ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉన్న భక్తులు కరోనా పరీక్షల తర్వతనే శబరిమల యాత్రకు రావాలని ఆదేశించారు. స్మోక్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.