- కేసీఆర్ దోచుకున్న డబ్బులు కక్కించాలి
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ, వెలుగు : ప్రాజెక్టుల పేర కేసీఆర్ కుటుంబం దోచుకున్న సొమ్మును కక్కించాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపైనే ఉందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో బీజేపీ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానన్న బాధతోనే రాజీనామా చేశానని, తన జీవితం మునుగోడు ప్రజలకు అంకితమని అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి పార్టీలో చేర్చుకొని కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. సిద్దిపేట, సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి మునుగోడులో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
ఉప ఎన్నిక మునుగోడు ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి జరుగుతున్న ధర్మ యుద్ధమని పేర్కొన్నారు. తాను అమ్ముడుపోయేవ్యక్తిని కాదని, మోసపూరిత మాటలతో తనను ఓడించాలని కుట్ర చేస్తున్నారని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు లోనే మకాం వేస్తున్నారని, వార్డ్ మెంబర్లను బతిలాడి, బెదిరించి గులాబీ కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే మంత్రి మునుగోడు నుంచి పోటీ చేయాలని, లేకుంటే తాను సూర్యాపేటలో పోటీ చేస్తానని సవాల్ చేశారు. తర్వాత నాంపల్లి, మర్రిగూడ మండలాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరారు.