
- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి
- ఆయిల్ పామ్ సుంకాన్ని 44 శాతానికి పెంచాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని, ఈ నేపథ్యంలో వరద సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ఆయన సమావేశమై, రాష్ట్రంలో రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణలో ప్రస్తుతం యూరియా కొరత కారణంగా నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే, ఆయిల్ పామ్ సుంకాన్ని 44 శాతానికి పెంచాలని, కనీస మద్దతు టన్నుకు ధర రూ.25 వేలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 71,985 మంది రైతులు 63,567 హెక్టార్లలో పామాయిల్ సాగు చేస్తున్నారని చెప్పారు. 2025–-26 సంవత్సరంలో మరో 50 వేల ఎకరాల్లో సాగుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. దీంతో దిగుమతి సుంకం సమస్యగా మారిందని, ముడి పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపును పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీ (ఎన్బీఎస్) స్కీం కింద ఫాస్పరస్, పొటాషియంపై రాయితీని పెంచాలని కోరారు. అంతర్జాతీయ పరిణామాలు, ప్రభావాలు రైతులపై పడకుండా ఉండాలంటే.. రాయితీని పెంచడం ఉత్తమమైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆ జిల్లాలను పీఎండీడీకేవైలో చేర్చండి..
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, ములుగు, కుమ్రం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాలను ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ జిల్లాల్లో రైతులు వర్షాధార పంటలను పండిస్తున్నారని.. పరిమితమైన మౌలిక సదుపాయాల కారణంగా తక్కువ దిగుబడి వస్తోందని వివరించారు. ఈ జిల్లాలను పీఎండీడీకేవై పథకంలో చేర్చడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు మేలు జరుగుతుందని మంత్రి వివరించారు.
వ్యవసాయ యంత్రాలపై 12 శాతం జీఎస్టీ తెలంగాణ రైతులకు ఆర్థిక భారాన్ని పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తుమ్మల వెల్లడించారు. ఈ సమావేశంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
కేంద్రం నిర్లక్ష్యంతోనే దేశంలో యూరియా కొరత
కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో దేశవ్యాప్తంగా యూరియా కొరత సమస్యగా మారిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. యూరియా సరైన సమయానికి రాకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. కేంద్ర మంత్రితో భేటీకి ముందు తుమ్మల మీడియాతో మాట్లాడారు. విదేశాల నుంచి అనుకున్న సమయానికి యూరియా దిగుమతి చేసుకోవడంలో కేంద్రం విఫలం చెందిందని, ఆ ప్రభావం తెలంగాణపైనా పడిందని చెప్పారు. భౌగోళికపరంగా రాష్ట్రంలో పండించే పంటలకు సెప్టెంబర్ 5లోపు ఎరుపులు చాలా అవసరమని, అందుకు తగ్గట్లు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కి 11 లక్షల టన్నులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.
అయితే, 9.8 లక్షల టన్నులు ఇస్తామని కేంద్రం చెప్పిందని, అందులోనూ ఇప్పటి వరకు 5.20 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందిందని వివరించారు. కేంద్రం ఆరోపిస్తున్నట్లు రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్కు ఆస్కారం లేదని మంత్రి స్పష్టం చేశారు.
యూరియా సమస్య ఒక్క తెలంగాణలోనే కాదని.. దేశవ్యాప్తంగా ఉందన్న విషయం కేంద్రం గుర్తించాలన్నారు. చైనా నుంచి ఎర్ర సముద్రం మీదుగా వచ్చే యూరియా రాకపోవడం, దేశీయంగా ఉత్పత్తి పెంచకపోవడంతో కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. రామగుండంలో 4 నెలలుగా యూరియా ఉత్పత్తి జరగడం లేదని, ఇంకా 15 రోజుల వరకు ఉత్పత్తి జరిగే పరిస్థితి లేదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన తెలిపారు.