బైకులకు టోల్ ట్యాక్స్ లేదు .. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ

బైకులకు టోల్ ట్యాక్స్ లేదు .. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ

న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై టూ వీలర్స్​కు కూడా టోల్ ట్యాక్స్ విధించనున్నారని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం క్లారిటీ ఇచ్చారు. టూ-వీలర్లకు టోల్ చార్జీల నుంచి మినహాయింపు కొనసాగుతుందని, అటువంటి ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని వెల్లడించారు. ‘కొన్ని మీడియా సంస్థలు నిజానిజాలను  నిర్ధారించుకోకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. ఇది ఆరోగ్యకరమైన జర్నలిజం కాదు’ అని గడ్కరీ అన్నారు. 

మరోవైపు నేషనల్​ హైవేస్​ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) కూడా ఈ వార్తలను ఖండించింది. టూ-వీలర్లకు టోల్ చార్జీలు ఉండవని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా, వ్యక్తిగత వాహనాలు.. కార్లు, జీపులు, వ్యాన్ల కోసం ఎన్​హెచ్​ఏఐ రూ.3 వేల వార్షిక  ఫాస్టాగ్ పాస్‌‌‌‌ను ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి  ప్రవేశపెడుతున్నది. ఈ పాస్ కమర్షియల్​ వాహనాలకు వర్తించదు. ఈ పాస్ యాక్టివేషన్, రెన్యువల్​ వివరాలను ఎన్​హెచ్​ఏఐ త్వరలో అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఉంచనుంది.