
సూర్యాపేట, వెలుగు : పుస్తకాల పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అక్రమంగా పాఠశాల పక్కన ఒక ఇంట్లో పుస్తకాలు అమ్ముతుంటే శనివారం పీడీఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అఖిల్ కుమార్ మాట్లాడుతూ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ఎక్కడాలేని విధంగా పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తు దోపిడీ చేస్తుందని ఆరోపించారు.
వివిధ రకాల పేర్లతో చిన్న పిల్లల నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థుల వరకు పుస్తకాలు, నోట్ బుక్స్, టై, యూనిఫాం, షూ, బెల్ట్ పాఠశాలలోనే తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. బీబీగూడెం పరిధిలో ఉన్న శ్రీచైతన్య సీబీఎస్ఈ పాఠశాలకు అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నారని, ఈ విషయం అనేక సార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి.. వీరికి సహకరిస్తున్న జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.