
హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. గురువారం (మే29) ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. తమిళనాడుకు చెందిన శంకర్, రమ్యను సీఐడీ అధికారులు చెన్నైలో అదుపులోకి తీసుకొని ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తరలించారు. వారినుంచి పాస్ పోర్టు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇంతకుముందు 13 మందిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఏడుగురు కోసం గాలింపు చేపట్టారు.
పేదలే టార్గెట్ ఈ ముఠా కిడ్నీ రాకెట్ ను సాగిస్తోంది. ఒక్కో ఆపరేషన్ కు పదిలక్షలు వసూలు చేస్తోంది ఈ ముఠా. కిడ్నీ డొనేట్ చేసిన వారికి రూ. 4లక్షలు తీసుకొని మిగతా రూ. 6లక్షలను ఈ ముఠా సభ్యులు పంచుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ALSO READ | హైదరాబాద్ ఏడు జోన్లలో సైబర్ సెల్ కేంద్రాలు.. ZCC పనితీరును వివరించిన సీపీ సీవీ ఆనంద్
అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో కీలక సూత్రధారి, ప్రధాన నిందితుడు డాక్టర్ రాజశేఖర్ పెరుమళ్లను హైదరాబాద్ సరూర్నగర్ పోలీసులు ఆదివారం రాత్రి చెన్నైలో అరెస్ట్ చేశారు. రాజశేఖర్ పై విజయవాడ, వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్ లో కేసులు నమోదయ్యాయి.
వైజాగ్కు చెందిన పవన్, లక్ష్మణ్ అనే కిడ్నీ మార్పిడి గ్యాంగ్ ఈ రాకెట్ వెనుక ఉన్నట్టు గుర్తించారు. ఈ గ్యాంగ్ కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. గత 7 నెలల వ్యవధిలోనే 20కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసి.. రూ.12 కోట్లు వసూలు చేసినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు వివరాలను రాచకొండ సీపీ సుధీర్బాబు శనివారం మీడియాకు వెల్లడించారు.