- అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్య: దామోదర
- ఉస్మానియాలోనైనా, ఆసిఫాబాద్లోనైనా ఒకే స్థాయి విద్య అందాలి
- మెడికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్పై మంత్రి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సంప్రదాయ విద్యా విధానంతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన డిజిటల్ ఎడ్యుకేషన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ ఎడ్యుకేషన్లో టెక్నాలజీని తీసుకురావడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా విద్యార్థులందరికీ సమానమైన విద్యను అందించవచ్చని స్పష్టం చేశారు.
ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్లో చదివిన డాక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకొని, అదేస్థాయి టీచింగ్ను కొత్తగా జిల్లాల్లో ఏర్పాటైన కాలేజీల్లోనూ అందించాలని, ఉస్మానియా విద్యార్థికైనా, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ విద్యార్థికైనా ఒకే రకమైన విద్య అందాలని మంత్రి సూచించారు. ఇందుకోసం క్లాసు రూమ్స్లో స్మార్ట్ బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్లు, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీతో టీచింగ్ ఉండాలి..
అనాటమీ, సర్జికల్ ప్రొసీజర్ల పట్ల విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు వర్చువల్ ల్యాబ్స్, సిమ్యులేషన్ టూల్స్, వర్చువల్ రియాలిటీ వంటి అధునాతన పద్ధతులను వినియోగించాలని మంత్రి దామోదర సూచించారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం కాలేజీలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దాలని, ఈ సెంటర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి ఫ్యూచర్ టెక్నాలజీపై స్పెషల్ ఫోకస్ పెట్టి.. ఇతర కాలేజీలకు మెంటార్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. ‘‘ఎన్ఎంసీ రూల్స్కు అనుగుణంగా సిలబస్ను డిజిటల్ రూపంలోకి మార్చి, నేషనల్ డిజిటల్ లైబ్రరీతో అనుసంధానం చేయాలి. టీచింగ్ హాస్పిటల్స్లో రద్దీ దృష్ట్యా, విద్యార్థులకు క్లినికల్ కేస్ స్టడీలను వివరించేందుకు టెలీ మెడిసిన్ విధానాన్ని వినియోగించుకోవాలి.
ప్రతి కాలేజీలో అవసరమైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్తో పాటు ఐటీ అడ్మినిస్ట్రేటర్లు, టెక్నీషియన్లను నియమించాలి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలి. విద్యార్థుల హాజరు, పనితీరును ఏఐ టూల్స్ ద్వారా నిరంతరం విశ్లేషించాలి. మన వైద్య విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రాణించేలా వారిని తీర్చిదిద్దడమే ఈ డిజిటల్ విధానం ప్రధాన ఉద్దేశం”అని మంత్రి పేర్కొన్నారు.
