ఇండియన్ రైల్వేలో తత్కాల్ టికెట్లను అక్రమంగా అమ్ముకోవడం, రిజర్వేషన్ వ్యవస్థ దుర్వినియోగం చేసిన అంశంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. 2023 నుంచి 2026 జూన్ వరకు 13 వేల 580 మంది దళారులను అరెస్టు చేసినట్లు చెప్పారు. అదే విధంగా దళారులకు సహకరించి తత్కాల్ కుంభకోణంలో భాగమైన 65 రైల్వే ఉద్యోగులను అరెస్టు చేశామని 2026 ఆగస్టు 12న లోక్ సభలో రాతపూర్వ సమాధానంగా పేర్కొన్నారు.
స్వతంత్ర ఎంపీ పటేల్ ఉమేష్భాయ్ బాబుభాయ్ ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి వివరాలు ఇచ్చారు. రైల్వే ఉద్యోగులు, దళారుల మధ్య తత్కాల్ టికెట్ల అనధికార అమ్మకాలకు సంబంధించి సంబంధం ఉందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. రైల్వేస్ చట్టం 1989 సెక్షన్ 143 కింద నేరస్థులపై (రైల్వే ఉద్యోగులతో సహా) చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
తత్కాల్ బుకింగ్లలో దళారులు రిజర్వేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తిన క్రమంలో .. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలకు సంబంధించిన గణాంకాలు వెల్లడించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) క్రమం తప్పకుండా చెకింగ్లు, ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ అనధికార టికెటింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.
