
- రిజర్వేషన్ల అంశంపై కింది కోర్టు విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన ప్రైవేట్ పిటిషన్లో సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గత విచారణలో కింది కోర్టు విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన హైకోర్టు.. గురువారం విచారణను నిలిపివేసింది. జస్టిస్ కె.లక్ష్మణ్ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని వ్యాఖ్యానించారు.
రేవంత్ కామెంట్లపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశారు. బీజేపీ పరువును దెబ్బతీసేలా రేవంత్ ప్రసంగం ఉందంటూ ఆయన మాట్లాడిన వీడియోలు, పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ను ఫిర్యాదుతో జత చేశారు. కాసం పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు.. సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. అయితే, ఆ పిటిషన్ను కొట్టేయాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు పెట్టారన్నారు. అనంతరం విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ.. ఈలోగా కాసం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.