
హైదరాబాద్, వెలుగు: బాధితులు కానప్పుడు ప్రైవేటు కాలేజీలు సమ్మర్ క్లాస్లు నిర్వహిస్తున్నట్లు పిల్ ఎలా వేస్తారని పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. వేసవిలో నిర్వహించే తరగతుల వల్ల ఇబ్బందులు పడితే స్టూడెంట్లు లేదా వాళ్ల పేరెంట్స్ కోర్టుకు వస్తారని, ఏ సంబంధం లేని మీరు కోర్టుకు ఎలా వస్తారని నిలదీసింది. పిటిషన్ లో కాలేజీలను ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. సమ్మర్ హాలిడేస్లో పలు ప్రైవేటు కాలేజీలు తరగతులు నిర్వహిస్తుంటే అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ అడ్వకేట్ బి. క్రాంతి కుమార్ వేసిన పిల్ను జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ నందికొండ నర్సింగ్రావులతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఇంటర్ బోర్డు ప్రకారం వేసవిలో ప్రైవేట్ కాలేజీలు తరగతులు నిర్వహించడానికి వీల్లేదన్నారు. కానీ కొన్ని కాలేజీలు భౌతిక, ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయని చెప్పారు. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. క్లాసులకు హాజరై, ఇబ్బంది పడిన బాధితులు లేకుండా పిటిషన్ విచారణార్హం కాబోదని వెల్లడించింది. న్యాయవాది స్పందిస్తూ.. ప్రజాహితం కోసం ఒక న్యాయవాదిగా పిల్ దాఖలు చేసినట్లు చెప్పారు.
విద్యార్థుల హక్కుల రక్షణకు కోర్టులు జోక్యం చేసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్రెడ్డి వాదిస్తూ.. ప్రైవేట్ కాలేజీల్లో వేసవి తరగతులు నిర్వహించడం లేదన్నారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు అనుమతించిన హైకోర్టు.. ప్రభుత్వం కౌంటరు దాఖలు చేశాకే తాము తగిన ఉత్తర్వులు ఇస్తామని చెప్పింది.