రేవంత్‌‌రెడ్డి పిటిషన్‌‌పై తీర్పు వాయిదా

రేవంత్‌‌రెడ్డి పిటిషన్‌‌పై తీర్పు వాయిదా

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ గచ్చిబౌలి పోలీస్‌‌ స్టేషన్‌‌లో తనపై 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును డిస్మిస్‌‌ చేయాలంటూ సీఎం ఎ.రేవంత్‌‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. శుక్రవారం ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు జస్టిస్‌‌ మౌసమీ భట్టాచార్య ప్రకటించారు. గోపనపల్లిలో సర్వే నం.127లోని 31 ఎకరాలకు సంబంధించి హక్కుల వివాదంలో ఎస్సీ మ్యూచ్యువల్లీ ఎయిడెడ్‌‌ కోఆపరేటివ్‌‌ హౌసింగ్‌‌ సొసైటీకి, రేవంత్‌‌రెడ్డి సోదరుడు కొండల్‌‌ రెడ్డి, ఎ.లక్ష్మయ్య మధ్య వివాదం ఉంది. 

అప్పుడు మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్‌‌రెడ్డి ప్రోత్సాహంతో సొసైటీకి చెందిన స్థలంలోకి చొరబడి తమను కులం పేరుతో దూషించారని పేర్కొంటూ సొసైటీకి చెందిన ఎన్‌‌.పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పీఎస్‌‌లో నమోదైన ఈ కేసును కొట్టేయాలంటూ 2020లో  పిటిషన్‌‌ వేశారు. ఈ కేసులో రేవంత్​ తరఫున అడ్వకేట్‌‌ రఘు వాదిస్తూ, ఘటన జరిగిన సమయంలో పిటిషనర్‌‌ ఆ స్పాట్‌‌లో లేరని తెలిపారు.