రప్పా రప్పా సంస్కృతిని నేను ప్రోత్సహించను : జగదీశ్ రెడ్డి

రప్పా రప్పా సంస్కృతిని నేను ప్రోత్సహించను : జగదీశ్ రెడ్డి
  • అది ఏపీలోని రేవంత్ మిత్రుల పని: జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సూర్యాపేటలో ఏర్పాటు చేసిన రప్పా,రప్పా ఫ్లెక్సీలు తన దృష్టికి రాలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ ఘర్షణలు లేవని గుర్తుచేశారు.తాను  ఇలాంటివి అసలు ప్రోత్సహించనని చెప్పారు. రాజకీయ దాడులు అనేవి ఏపీలో ఉన్న రేవంత్ రెడ్డి మిత్రుల పని అని, ఆ దాడుల సంస్కృతిని తెలంగాణకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. 

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. గోదావరి, బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా లేదని ఆరోపించారు. కృష్ణా నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారని, ఇప్పుడు గోదావరి విషయంలోనూ  అన్యాయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బనకచర్లపై అన్ని పార్టీలు తెలంగాణలో ఏకం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబును చర్చలకు పిలవాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పనికిమాలిన చర్య అని మండిపడ్డారు. చంద్రబాబు మాయలో పడవద్దని ప్రభుత్వానికి జగదీశ్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు.