ఫాంహౌస్ నిందితుల బెయిల్ పిటిషన్ 11కు వాయిదా

ఫాంహౌస్ నిందితుల బెయిల్ పిటిషన్ 11కు వాయిదా

హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీని పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నిందితులు ప్రయత్నించారని, కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారని పోలీసుల తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముగ్గురు నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలను తెలుసుకోవడానికి నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో వారిని రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. 

రాజకీయ కారణాలతో ముగ్గురిపైనా అక్రమ కేసులు పెట్టారని, ఎక్కడ కూడా డబ్బులు లభించలేదని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. రేపు ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.