టాయిలెట్లు కట్టించిన్రు సరే.. మరి జనాలు వాడుతున్నారా?

టాయిలెట్లు కట్టించిన్రు సరే.. మరి జనాలు వాడుతున్నారా?
  •              ఇండియా 100% ఓడీఎఫ్‌: ప్రధాని మోడీ
  •                 ఇంకా సక్సెస్‌ కాలేదంటున్న ఆర్‌ఐసీఈ
  •                 గ్రామాల్లో ఇంకా 10% బయటికే: డబ్ల్యూహెచ్‌వో

ఐదేళ్ల కిందట దేశంలో సగం కుటుంబాలకు టాయిలెట్లు లేవు. రెంటికి పోవాలంటే బయటకు పోవాల్సిందే. అందుకే దేశంలో అసలు బహిరంగ మల విసర్జనే లేకుండా చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. 2014లో స్వచ్ఛభారత్‌ను స్టార్ట్‌ చేసింది. ఐదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లను కట్టించింది. ఇండియాలో బహిరంగ మల విసర్జన ఉండదని అప్పట్లో అంటే ఎవ్వరూ నమ్మలేదని, స్వచ్ఛభారత్‌తో నిజం చేసి చూపించామని అక్టోబర్‌ 2న గాంధీజయంతి సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ అన్నారు. దేశంలో ఓపెన్‌ డెఫకేషనే లేదని ప్రకటించారు. 60 నెలల్లో 60 కోట్ల ప్రజల కోసం 11 కోట్ల టాయిలెట్లు కట్టించామని చెప్పారు. కానీ ఎక్స్‌పర్ట్స్‌ మాత్రం ‘లెక్కలు’ మనల్ని పక్కదోవ పట్టిస్తున్నాయంటున్నారు. ఓపెన్‌ డెఫెకేషన్‌ దేశంలో ఇంకా పూర్తిగా పోలేదని చెబుతున్నారు. టాయిలెట్లయితే కట్టించారు గానీ మరి వాటిని జనాలు వాడుతున్నారా? అని అడుగుతున్నారు. టాయిలెట్లు కట్టడంపై మస్తు దృష్టి పెట్టిన సర్కారు వాటిని జనాలు వాడేలా చూడటంలో సక్సెస్‌ కాలేకపోయిందని అంటున్నారు. వాటిని సరిగా మెయింటెయిన్‌ చేస్తున్నారో లేదో కూడా పట్టించుకోలేదని రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపాషనేట్‌ ఎకనమిక్స్‌ రీసెర్చర్లు చెబుతున్నారు.

ఇంకా 10 శాతం..

దేశం 100 శాతం ఓపెన్‌ డెఫకేషన్‌ ఫ్రీ అని కేంద్రం అంటున్నా.. వరల్డ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరిలో చేసిన ఓ సర్వేలో 10 శాతం మంది గ్రామీణ ప్రజలు ఇంకా బయటకే పోతున్నారని వెల్లడైంది. టాయిలెట్లు ఉన్న వాళ్లలో ఇంకా 4 శాతం మంది వాటిని వాడటం లేదని తెలిసింది. అయితే ప్రభుత్వం చేసిన పనికి పొగడాల్సిందేనని, యుద్ధప్రాతిపదికన పనులు చేసి ఎన్నో టాయిలెట్లు దేశవ్యాప్తంగా కట్టించిందని ఆర్‌ఐసీఈ రీసెర్చర్లు అన్నారు. కానీ ఓపెన్‌ డెఫకేషన్‌ మాత్రం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని చెప్పారు. ‘2014లో 4 ఈశాన్య రాష్ట్రాల్లో సర్వే చేశాం. 70 శాతం మంది రెంటికి బయటికే వెళ్తున్నట్టు వెల్లడైంది. 2018లో మళ్లీ సర్వే చేశాం. ఈసారి 48 శాతం మంది బయటికి పోతున్నట్లు తెలిసింది’ అని రీసెర్చర్లు చెప్పారు. టాయిలెట్లు కట్టించడంపై దృష్టి పెట్టిన సర్కారు వాటి మెయింటెనెన్స్‌, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ను పెద్దగా పట్టించుకోలేదన్నారు. లెట్రిన్లు కట్టడమే కాదు, వాటినెట్లా వాడాలో, ఎందుకు వాడాలో జనానికి చెబితే కచ్చితంగా వాడతారన్నారు. ఇండియాలో జనాలు ఇంట్లోని టాయిలెట్‌ను వాడటం కన్నా బయటకు వెళ్తేనే ఇల్లు శుభ్రంగా ఉంటుందనుకుంటారని, కాబట్టి గ్రామీణ జనాల్లో మార్పు కోసం కష్టపడాల్సిందేనన్నారు.

ఓడీఎఫ్​ ఇండియాలోనే ఎక్కువ

బహిరంగమల విసర్జన ప్రపంచంలో మనదేశంలోనే ఎక్కువని, ఇండియాలోని 62 కోట్ల మంది బయటే రెంటికి వెళ్తున్నారని యునిసెఫ్‌ చెప్పింది. దీని వల్ల చిన్న పిల్లలకు డయేరియా లాంటి ప్రమాదక రోగాలోస్తాయని హెచ్చరించింది. కలుషితమైన ఆహారం, శుభ్రత పాటించకపోవడం వల్లే చిన్నారుల మరణాలు, రోగాలు, పోషకాహారలోపం పెరుగుతున్నాయని పేర్కొంది. బహిరంగ మల విసర్జనకు వెళ్లిన మహిళలు, యువతులపై దాడులు జరుగుతున్న ఘటనలూ ఉన్నాయంది. కానీ మోడీ క్లీన్‌ ఇండియా క్యాంపెయిన్​తో గత ఐదేళ్లలో మూడు లక్ష మరణాలు తగ్గించగలిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. సరైనన్ని టాయిలెట్లు లేకపోవడం, శుభ్రతపై అవగాహన లేకపోవడం, రోగాలొస్తాయని తెలియకపోవడం వల్లే జనం బహిరంగ మలవిసర్జకు వెళ్తున్నారంది.